“ వైసీపీ ది దుర్మార్గ మనస్తత్వం. తామే బతకాలి. పక్కవాళ్లు చెడిపోవాలని కోరుకుంటారు. అందుకే నా ఇంటిపైకి దాడికి వచ్చా రు. రాజమండ్రి జైల్లోనే నన్ను ఏదో చేయాలని చూశారు. కానీ, నేను అలా చేయలేను. వారిలాంటి మనస్తత్వం నాకు లేదు. ఏం చేయను.. సారీ!“- టీడీపీ నాయకులు, కార్యకర్తలతో తాజాగా చంద్రబాబు చెప్పిన మాట ఇది. గుంటూరు జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబువద్దకు మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు.. పిన్నెల్లిరామకృష్ణారెడ్డి కారణంగా ఇళ్లు కోల్పోయి.. ఆయన అనుచరులు చేసిన దాడుల్లో అవయవాలు కోల్పోయిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు గంపగుత్తగా చంద్రబాబును కలిశారు.
తమ ఆవేదనను చంద్రబాబుకు వివరించారు. “నాడు టీడీపీ జెండా పట్టుకున్నందుకు.. మా ఆయనను అపహరించి.. కాళ్లు రెండూ విరగొట్టారు. ప్రస్తుతం వీల్ చైర్లో ఉన్నాడు“ అని టీడీపీ మహిళా కార్యకర్త కన్నీరు పెట్టుకుంది. “మా ఇల్లు, పొలం బలవంతంగా లాక్కున్నారు. వేరే వారి పేరుతో రిజిస్టర్ చేసుకున్నారు. అదేమని ప్రశ్నిస్తే.. పోలీసులతో మా కుటుంబం మొత్తాన్ని కొట్టించారు. రోజంతా స్టేషన్లో ఆకలితోనే ఉన్నాం“ అని నాటి బాధను చంద్రబాబుతో ఓకుటుంబం పంచుకుంది. మరికొందరు కూడా ఇలానే చెప్పుకొచ్చారు. ఇంకొదరు తమ ఇంటిపై టీడీపీ జెండా ఉందని ఇంటిని కూలగొట్టారని.. మొండి గోడల తాలూకు ఫొటోలను చంద్రబాబుకు చూపించారు.
ఆయా బాధలు, వారి కన్నీళ్లు చూసిన చంద్రబాబు కరిగిపోయారు. వారిని ఊరడించారు. ఈ సందర్భంగా కొందరు.. పిన్నెల్లి అనుచరులకు కూడా ఇలాంటి శాస్తి చేయాలని చంద్రబాబును కోరారు. అయితే..చంద్రబాబు నిస్సహాయత వ్యక్తం చేశారు. కక్ష పెట్టుకుని ఏమీ చేయలేమని.. చట్టం ప్రకారం వారి తప్పులను నిరూపించి కోర్టు ద్వారా శిక్షలు పడేలా చూస్తానని హామీ ఇచ్చారు. అయితే.. ఇళ్లు కోల్పోయిన వారికి.. బాధితులుగా మారిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఇళ్లు కోల్పయిన వారికి ఇళ్లు కట్టించి ఇస్తామన్నారు. అసలు భూములు లాగేసుకున్నవారికి చట్టం ప్రకారం ఏం చేయాలో చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగానే తను వైసీపీ నాయకుల మాదిరిగా దుర్మార్గంగా వ్యవహరించలేనని.. సారీ అని చెప్పడం గమనార్హం.