జమ్మూ కాశ్మీర్లోని ప్రఖ్యాత పర్యాటక కేంద్రమైన పహల్గామ్ లో మంగళవారం జరిగిన ఉగ్రదాడి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. సైనిక దుస్తుల్లో వచ్చిన ఏడుగురు ఉగ్రవాదులు పర్యాటకులే లక్ష్యంగా చేసుకుని విచక్షణారహితంగా కాల్పులకు తెగపడ్డారు. ఈ దాడిలో 27 మంది పర్యాటకులు మృతి చెందగా.. చాలా మంది గాయాల పాలయ్యారు. మరికొందరు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని బయటపడ్డారు.
పహల్గామ్ ఉగ్ర దాడి నుంచి ఓ సెలబ్రిటీ కపుల్ తృటిలో తప్పించుకుంది. బాలీవుడ్ ఫేమస్ టెలివిజన్ జంట దీపికా కాకర్ మరియు షోయబ్ ఇబ్రహీం తమ కుమారుడు రుహాన్తో కలిసి ఇటీవల వెకేషన్ కోసం కాశ్మీర్ వెళ్లారు. అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ.. అందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఆదివారం సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
అయితే మంగళవారం పహల్గామ్ లో ఉగ్ర దాడి జరగడంతో.. సదరు సెలబ్రిటీ కపుల్ యొక్క అభిమానులు కలవరపాటుకు గురయ్యారు. ఈ ఘటనలో వారెక్కడ చిక్కుకున్నారో అని సోషల్ మీడియా ద్వారా ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో మంగళవారం, దీపికా, ఆమె భర్త షోయబ్ తాము సేఫ్ అంటూ ఓ పోస్ట్ పెట్టారు. `మా శ్రేయస్సు కోసం ఆందోళన చెందిన వారందరికీ ధన్యవాదాలు. మేము క్షేమంగా ఉన్నాము. మంగళవారం ఉదయమే కాశ్మీర్ నుంచి బయటదేరి సురక్షితంగా ఢిల్లీ చేరుకున్నాము. ఎవరూ ఆందోళన చెందకండి. తమ కాశ్మీర్ వెకేషన్ వ్లాగ్ త్వరలో వస్తుంది` అంటూ షోయబ్ పోస్ట్ పెట్టారు. అయితే ఈ పోస్ట్ విమర్శలకు దారి తీసింది. ఓవైపు పహల్గామ్లో చోటుచేసుకున్న దారుణం యావత్ దేశాన్ని కుదిపేస్తుంటే.. దీపికా, షోయబ్ జంట తమ వ్లాగ్ ను ప్రచారం చేసుకోవడం అవసరమా అంటూ నెటిజన్లు విమర్శలు కురిపిస్తున్నారు.