కొన్ని అంశాల మీద పార్టీ అధినేతలు ఎంత ఆలస్యంగా మేలుకొంటారన్నదానికి నిదర్శనంగా వారి నిర్ణయాలు ఉంటారు. బోలెడన్ని వివాదాలు.. నిత్యం ఏదో ఒక ఇష్యూలో మీడియాలో నానుతూ.. సంబంధం లేని అంశాల్లో తలదూర్చిన కారణంగా.. పార్టీకి చెడ్డపేరును తీసుకొచ్చే నేతలు కొందరు ఉంటారు. ఆ కోవలోకే వస్తారు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. నిజానికి వైసీపీ ఇమేజ్ ను డ్యామేజ్ చేసిన కొద్దిమంది నేతల్లో దువ్వాడ శ్రీనివాస్ ఒకరు.
ఎమ్మెల్సీగా వ్యవహరిస్తూ.. ఆ పదవి ద్వారా పార్టీకి మేలు చేసిన దాని కంటే కీడు చేసిందే ఎక్కువ. తన వ్యక్తిగత పంచాయితీలతో పార్టీ పేరును రోడ్డు మీదకు తీసుకొచ్చారని చెప్పాలి. ఆయన చేసిన తప్పులకు పార్టీ ఎప్పుడో సీరియస్ గా రియాక్టు కావాల్సింది. కానీ.. ఎందుకో తెలీదు కానీ ఆయన వ్యవహారశైలి.. వ్యక్తిగత పంచాయితీలు మీడియాలో హెడ్ లైన్స్ గా మారినప్పటికి ఎలాంటి చర్యలు తీసుకున్నది లేదు.
అందుకు భిన్నంగా తాజాగా మాత్రం ఆయనపై సీరియస్ చర్యలు తీసుకోవటం ద్వారా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విస్మయానికి గురి చేశారు. ఇంతకాలం పార్టీకి బరువుగా మారిన దువ్వాడపై చర్యలు తీసుకోకుండా ఉండిపోయిన అధినేత.. ఇప్పుడు మాత్రం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయాన్ని ప్రకటించారు. ఎందుకిలా చేశారు? ఇలాంటి నిర్ణయం తీసుకోవటం వెనుక కారణం ఏమిటి? అన్న ప్రశ్నలకు చెబుతున్న సింఫుల్ సమాధానం.. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనలకు పాల్పడినట్లుగా ఫిర్యాదులు రావటంతో చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.
తమ చర్యలకు సంబంధించి క్లుప్తమైన వివరాలతో సస్పెండ్ చేస్తున్నట్లుగా ప్రకటన జారీ చేశారు. నిజానికి ఈ నిర్ణయాన్నే ఏడాది క్రితం తీసుకొని ఉంటే.. దువ్వాడ కారణంగా పార్టీకి జరిగిన నష్టంలో అంతో ఇంతో తగ్గి ఉండేదని చెప్పక తప్పదు. అప్పుడంతా మౌనంగా ఉండిపోయి.. ఇప్పుడు హటాత్తుగా చర్యల కొరడాను ఎందుకు ఝుళిపించినట్లు? అన్న ప్రశ్నకు మాత్రం ఎలాంటి సమాధానం రాకపోవటం గమనార్హం.