వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఏపీ రాజ్యసభ స్థానానికి సీఈసీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. గతంలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవ్వగా.. టీడీపీ రెండు, బీజేపీ ఒకటి చొప్పున పంచుకున్నాయి. అయితే ఈసారి విజయసాయిరెడ్డి స్థానాన్ని తమ పార్టీ అభ్యర్థితో భర్తీ చేయాలని బీజేపీ భావిస్తోంది. ఇదే విషయాన్ని మంగళవారం ఢిల్లీలో తనను కలసిన సీఎం చంద్రబాబుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పినట్టు వార్తలు వచ్చాయి.
బీజేపీ అభ్యర్థికి మద్దతు తెలిపేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సుముఖత వ్యక్తం చేసినట్టుగా సమాచారం అందుతోంది. అయితే ఏపీ నుంచి బీజేపీ తరఫున రాజ్యసభ్యకు వెళ్లేది ఎవరు అన్న చర్చ జోరుగా సాగుతోంది. రెండు రోజుల క్రితం మాజీ ఐపీఎస్ అధికారి, తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై పేరు ప్రముఖంగా వినిపించింది. దూకుడు వైఖరితో ఫైర్ బ్రాండ్ నేతగా పేరు తెచ్చుకున్న అన్నామలై తమిళనాడులో బీజేపీ బలోపేతానికి ఎంతగానో కృషి చేశారు.
కొన్ని పరిణామల నడుమ ఇటీవల ఆయన రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అయితే ఏపీ కోటాలో బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలైను రాజ్యసభకు పంపాలని కమలం పార్టీ పెద్దలు భావిస్తున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు రేసులో మరో కొత్త పేరు వచ్చి చేరింది. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ రాజ్యసభ రేసులో ఉన్నారు. మంగళవారం చంద్రబాబు కన్నా ముందే కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మంద కృష్ణమాదిగ ఇద్దరూ అమిత్ షాను కలిశారు.
ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ అమలులోకి వచ్చినందుకు కృష్ణమాదిగ అమిత్ షాకు ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం ఢిల్లీలోని ముఖ్యమంత్రి నివాసానికి వచ్చి చంద్రబాబును కూడా కృష్ణమాదిగ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దీంతో ఏపీ నుంచి రాజ్యసభకు మంద కృష్ణమాదిగను పంపిస్తారనే చర్చ జరుగుతోంది. మరి అన్నామలై, కృష్ణమాదిగలలో ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లే ఛాన్స్ ఎవర్ని వరిస్తుందో చూడాలి.