ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ముంబై నటి జత్వానీపై వేధింపులకు పాల్పడిన కేసులో ఆంజనేయులు ఏ2గా ఉన్నారు. ఇప్పటికే ఆయన సస్పెన్షన్ లో ఉన్నారు. ఇటీవల హైకోర్టు సీరియస్ అవ్వడంతో.. ఏపీ సీఐడీ అధికారులు తాజాగా హైదరాబాద్లో ఐపీఎస్ ఆంజనేయులు ను అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు. అయితే వైసీపీ మాత్రం ఆంజనేయులు అరెస్ట్ విషయంలో కొత్త రాగం అందుకుంది.
కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమై తమ వైఫల్యాలను ఇలాంటి అరెస్టులతో కప్పిపుచ్చుకుంటోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పైగా పీఎస్ఆర్ ఆంజనేయులు బుద్ధిమంతుడు అనే రేంజ్ లో బిల్డప్ ఇస్తున్నారు. నేడు వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులతో సమావేశం అయిన జగన్.. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ దిగజారిపోతున్నాయని.. ఐపీఎస్ ఆంజనేయులు అరెస్ట్ ఈ పరాకాష్టకు నిదర్శనమని ఫైర్ అయ్యారు. దుర్మార్గపు సంప్రదాయాలకు చంద్రబాబు తెరలేపుతున్నారని ధ్వజమెత్తారు.
మరోవైపు వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఆంజనేయులు అరెస్ట్ అన్యాయమంటూ మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ విధంగా అరెస్టుల పర్వానికి తెరలేపిందని అంబటి ఆరోపించారు. మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా రియాక్ట్ అవుతూ.. పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టును డర్టీ డైవర్షన్ పాలిటిక్స్ గా అభివర్ణించారు. ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోందని రోజా విమర్శించారు.
అయితే జగన్ హయాంలో పీఎస్ఆర్ ఇంటెలిజెన్స్ చీఫ్గా అనేక అనైతిక కార్యక్రమాలకు పాల్పడ్డారని బలమైన ఆరోపణలు ఉన్నాయి. నటి జత్వానీ కేసుతో పాటు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుపై థర్డ్ డిగ్రీ కేసులోనూ ఆంజనేయులు నిందితుడిగా ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్ వెనుక కథ నడిపిందీ ఆంజనేయులే అన్న ఆరోపణ ఉంది. ఇక జగన్ కు ఆంజనేయులు నమ్మిన బంటు అనేది కూడా అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. తాజాగా ఆయన అరెస్ట్ పక్కా ఆధారలతోనే జరిగింది. అలాంటప్పుడు వైసీపీ నేతలు ఆంజనేయులు అరెస్ట్పై ఎందుకింత ఓవర్ గా రియాక్ట్ అవుతున్నారంటూ తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు.