వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు అధినేత జగన్ ఎట్టకేలకు మంగళం పాడారు. పార్టీ నుంచి దువ్వాడను సస్పెండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయం నుండి ప్రకటన విడుదలైంది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్లు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో, పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు వైయస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ గారి ఆదేశాల ప్రకారం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారిని పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది అంటూ ప్రకటనలో తెలియజేశారు.
అయితే ఈ నిర్ణయాన్ని ఎప్పుడో తీసుకోవాల్సిన జగన్ ఇంత ఆలస్యమెందుకు చేశారన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇందుకు కారణం లేకపోలేదు. దువ్వాడ పార్టీ క్రమశిక్షణ అతిక్రమించారో లేదో అన్నది పక్కన పెడితే.. వ్యక్తిగత క్రమశిక్షణ తప్పి తన పరువుతో పాటు పార్టీ పరువును కూడా బజారుకు ఈడ్చారు. భార్య, పిల్లలను విభేదించిన దువ్వాడ దివ్వెల మాధురితో సహజీవనం ప్రారంభించారు. మాధురితో కలిసి ఉండేందుకు టెక్కలిలో ఓ ఇంటిని కూడా నిర్మించారు.
అయితే దువ్వాడ శ్రీనివాస్ నూతన ఇంటి కోసం ఆయన భార్య వాణి, పిల్లలు కొద్ది రోజుల పాటు నానా రచ్చ చేశారు. దువ్వాడ కుటుంబ వివాదం రాష్ట్రంలో పెను దుమారాన్ని రేపింది. మీడియా ఈ విషయాన్ని ఎంత హైలెట్ చేసినప్పటికీ జగన్ మాత్రం స్పందించలేదు. ఇక ఈ మధ్యకాలంలో దువ్వాడ హైదరాబాద్ కే పరిమితమయ్యారు. అక్కడ మాధురితో కలిసి చీరల దుకాణాన్ని స్టార్ట్ చేశారు.
పార్టీ కార్యకలాపాలు, కార్యకర్తలను గాలికి వదిలేసి టీవీ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ మాధురితో కలిసి దువ్వాడ ప్రేమ పాటలు వల్లిస్తున్నారు. కొన్ని ఛానల్స్ లో ఏకంగా దువ్వాడ శ్రీనివాస్, మాధురి హగ్గులు, ముద్దులతో కూడా రెచ్చిపోతున్నారు. దీని తోడు పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలు, ఇటీవల విద్యుత్ శాఖ ఏఈకి ఫోన్ చేసి బెదిరించడం వంటి అంశాలతోనూ దువ్వాడ వార్తల్లో నిలిచారు. ఈ పరిణామాలన్ని పార్టీ ఇమేజ్ ను దారుణంగా డ్యామేజ్ చేశాయి. అయినకూడా సైలెంట్ గా ఉన్న జగన్.. ఇప్పుడు సడెన్ గా దువ్వాడపై సస్పెన్షన్ వేటు వేశారు. పార్టీకి జరగాల్సిన నష్టమంతా జరిగాక దువ్వాడను సాగనంపడంపై కార్యకర్తలు అసహనం వ్యక్తం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం ఎప్పుడో తీసుకుని ఉండాల్సిందని హైకమాండ్ కు హితవు పలుకుతున్నారు.