2025-26 సంవత్సరానికి గాను కేంద్ర వార్షిక బడ్జెట్ ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. నిర్మలమ్మ కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టడం వరుసగా ఇది ఎనిమిదోసారి అవ్వడం ఒక విశేషమైతే.. దేశ చరిత్రలోనే తొలిసారిగా కేంద్ర బడ్జెట్ రూ.50 లక్షల కోట్ల మార్కును దాటేయడం మరొక విశేషం. మొత్తం రూ.50,65,345 కోట్లతో వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరిగింది. ఇక ఈ బడ్జెట్లో ఏపీ కి కేంద్రం వరాలు జల్లు కురిపించింది. రాష్ట్రానికి ప్రత్యేకంగా కేటాయింపులు చేసింది.
ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ తో పాటు విశాఖ స్టీల్కు, విశాఖ పోర్టుకు, రోడ్లు-వంతెనల ప్రాజెక్టుకు కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు జరిగాయి. పోలవరం ప్రాజెక్ట్కు ఈసారి రూ.5,936 కోట్లు ఇచ్చింది. పోలవరం నిర్మాణానికి బ్యాలెన్స్ గ్రాంటుగా మరో రూ. 12,157 కోట్లు కేటాయించింది. విశాఖ స్టీల్కు రూ.3,295 కోట్లు, విశాఖ పోర్టుకు రూ.730 కోట్లు కేంద్ర బడ్జెట్ లో ప్రతిపాదించారు.
ఏపీ ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి రూ.162 కోట్లు, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ కి రూ. 186 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో రహదారులు, వంతెనల నిర్మాణానికి బడ్జెట్లో కేటాయింపులు జరిగాయి. ఏపీలో రోడ్లు, వంతెనల ప్రాజెక్టుకు రూ.240 కోట్లు, లెర్నింగ్ ట్రాన్స్ఫార్మేషన్ ఆపరేషన్ కి మద్దతుగా రూ. 375 కోట్లు, రాష్ట్ర ఇరిగేషన్, లైవ్లీ హుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు రెండొవ దశకు రూ.242.50 కోట్లు కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదించారు. బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన కేటాయింపులపై ఏపీకి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.