వివేకా హత్య కేసు విచారణ ఇంకా నత్తనడకన సాగుతోందని వివేకా కూతురు సునీతా రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. దాంతోపాటు, ఈ కేసు విచారణను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని కూడా ఆమె డిమాండ్ చేశారు. దీంతోపాటు, ఈ కేసులో సాక్షులుగా ఉన్న వారు ఒక్కొక్కరిగా మొత్తం ఆరుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సంచలనం రేపింది. ఈ నేపథ్యంలోనే ఆ వ్యవహారంపై సిట్ విచారణ చేపట్టింది. ఈ కేసులో కీలక సాక్షి అయిన వివేకా వాచ్ మన్ రంగన్న మృతి అనంతరం సిట్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఆ కేసులో సాక్షులు ఒక్కొక్కరిగా మరణించడంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. కె.శ్రీనివాసరెడ్డి 2019, సెప్టెంబరు 3న, వైఎస్ జగన్ కారు డ్రైవరు నారాయణ యాదవ్ 2019 డిసెంబరు 6న, వైఎస్ భారతి తండ్రి డాక్టర్ ఈసీ గంగిరెడ్డి 2020 అక్టోబరు 3న, గంగాధర్రెడ్డి 2022 జూలైలో, డాక్టర్ వైఎస్ అభిషేక్రెడ్డి 2025 జనవరి 10న మరణించారు. కె.శ్రీనివాసరెడ్డి బామ్మర్ది కసునూరు పరమేశ్వర్రెడ్డిని విచారణ కోసం లింగాల పోలీసుస్టేషన్ కు సిట్ అధికారులు తీసుకువెళ్లారు.
పరమేశ్వర్ రెడ్డి వాంగ్మూలాన్ని నమోదు చేసిన సిట్ అధికారులు ఈ కేసులో మరో కీలక సాక్షి రంగన్న భార్య సుశీలమ్మను విచారణకు రావాల్సిందిగా నోటీసులిచ్చారు. రంగన్న పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా ఈ కేసులో కీలక పరిణామాలు జరగబోతున్నాయని తెలుస్తోంది.