తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ పార్టీ ఏర్పడి ఈ నెల 27(ఆదివారం-రేపు)కు 25 సంవత్సరాలు నిండుతాయి. దీనిని పురస్కరించుకుని ఉమ్మడి వరంగల్లు జిల్లాలోని ఎల్కతుర్తిలో భారీ ఎత్తున రజతోత్స వ వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 10 లక్షల మంది ప్రజలు వస్తారని అంచనా వేస్తున్న ఈ సభపై కేసీఆర్ తోపాటు బీఆర్ ఎస్ నాయకులు భారీ ఆశలే పెట్టుకున్నారు.
తాజాగా ఈ రజతోత్సవానికి సంబంధించి.. ఒక పాటను విడుదల చేశారు. వీడియో సాంగ్ రూపంలో సోషల్ మీడియాలో విడుదల చేసిన ఈపాట పూర్తిగా.. కేసీఆర్ చేత, కేసీఆర్ వలన, కేసీఆర్ కోసం.. అన్నట్టుగానే సాగింది. బీఆర్ ఎస్ నాయకుడు, రచయిత దేశపతి శ్రీనివాస్ రచించిన 5 చరణాల పాట పూర్తిగా కేసీఆర్ ను ఆకాశానికి ఎత్తేస్తూ.. అదేసమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను నేలకు విసిరికొట్టినట్టుగా రచయిత తన కలాన్ని పదునెక్కించారు.
“చరిత్ర కడుపున పుట్టింది ఉద్యమాగ్ని శిశువు.. అది తెలంగాణ తలరాతను మార్చిన నవవసంత ఋతు వు“ పల్లవితో సాగే ఈ పాట.. ఆద్యంత్యం.. కేసీఆర్ ను ఆకాశానికి ఎత్తేయడమే కాకుండా..తెలంగాణ సెంటి మెంటును పదే పదే ప్రతి వాక్యంలోనూ రెచ్చగొట్టేలా ఉండడం గమనార్హం. అదేసమయంలో `ఫాదర్ ఆఫ్ తెలంగాణ కేసీఆర్` అనే వాక్యాన్ని దీనిలో చేర్చేశారు. అలాగే.. తెలంగాణకు దిక్కు-మొక్కు.. ఆయనేనని తేల్చేశారు. మొత్తంగా ఈ పాట కేసీఆర్తోపాటు.. తెలంగాణ సెంటిమెంటును కూడా మరోసారి తట్టి లేపింది.
గత పదేళ్ల పాలనేంటి?
తెలంగాణ సెంటిమెంటునే నమ్ముకున్న నేపథ్యంలో గత పదేళ్ల పాలన పరిస్థితి ఏంటన్నది ప్రశ్న. అనేక పథకాలు, కార్యక్రమాలు, ఉచితాలు, సంక్షేమం వంటివిఅమలు చేశారు. కానీ, ఈ పాటలో మచ్చుకు కూడా.. అవి కనిపించలేదు. వినిపించలేదు. కేవలం నీటి ప్రాజెక్టుల గురించి మాత్రమే ప్రస్తావించారు. పైగా.. నిధులు-నీళ్లు-నియామకాలనే వాదనను మరోసారి వినిపించారు. సో.. గత పదేళ్ల కేసీఆర్ పాలనలో మంచి చెడులు లేకుండానే.. పూర్తి ఏకపక్షంగా.. కేసీఆర్ను ఆకాశానికి ఎత్తేస్తూ.. లిఖించిన ఈ పాట.. ఏమేరకు ప్రయోజనం చేకూర్చుతుందో చూడాలి.