సుదీర్ఘకాలం నుంచి సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా సత్తా చాటుతున్న ముద్దు గుమ్మల్లో తమన్నా ఒకరు. టాలీవుడ్, కోలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్న తమన్నా.. ప్రస్తుతం హీరోయిన్ గానే కాకుండా ఐటమ్ సాంగ్స్ తో కూడా అలరిస్తోంది. త్వరలోనే `ఓదెల 2` సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది. సంపత్ నంది అందించిన కథతో అశోక్ తేజ డైరెక్ట్ చేసిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీ ఇది. తమన్నా మెయిన్ లీడ్ లో యాక్ట్ చేయగా.. వశిష్ట ఎన్.సింహ, హెబ్బా పటేల్, మురళీ శర్మ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు.
ఏప్రిల్ 17న ఓదెల 2 మూవీ థియేటర్స్ లో సందడి చేయబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తమన్నా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది. సినిమా గురించి మాట్లాడుతూ.. `ఓదెల2 దయవల్ల నాకు కాశీ చూసే భాగ్యం దక్కింది. నేను నాగసాధువు గా కనిపిస్తా. ఈ చిత్రంలో మేకప్ లేకుండా నటించా.. మండుటెండల్లో చెప్పుల్లేకుండా నడిచా. నా పాత్రను అత్యంత సహజంగా, అందరూ నమ్మగలిగేలా మ్యాజికల్గా చూపించడం ఓ పెద్ద ఛాలెంజ్.` అంటూ తమన్నా చెప్పుకొచ్చింది.
అలాగే ఇదే ఇంటర్వ్యూలో ఒక నటిగా తమ డ్రీమ్ ఏంటనేది తమన్నా రివీల్ చేసింది. `శ్రీదేవి గారు నేను ఎంతగానో అభిమానించే, ఆరాధించే నటి. భారతీయ సినిమాలో ఆమె ప్రయాణం స్ఫూర్తిదాయకం. ఆమె బయోపిక్లో నటించాలనేది నా కల. ఆ ఛాన్స్ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను` అంటూ తమన్నా తెలిపింది. మరి శ్రీదేవి బయోపిక్లో యాక్ట్ చేయాలన్న తమన్నా కల నెరవేరుతుందా? లేదా? అన్నది చూడాలి.