. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఫార్చూన్ 500 కంపెనీ సిఫీ కు లోకేష్ ఆహ్వానం.
. మంత్రి లోకేష్ ను కలిసిన సిఫీ ఛైర్మెన్ అండ్ మ్యానేజింగ్ డైరెక్టర్ రాజు వేగేశ్న.
. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేసిన సిఫీ ఛైర్మెన్ రాజు వేగేశ్న.
అమరావతి, 12-2-25 : రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సిఫీ టెక్నాలజీస్ ఛైర్మెన్ అండ్ మ్యానేజింగ్ డైరెక్టర్ రాజు వేగేశ్న ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆహ్వానించారు. ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ ను సిఫీ టెక్నాలజీస్ ఛైర్మెన్ అండ్ మ్యానేజింగ్ డైరెక్టర్ రాజు వేగేశ్న కలిసారు. ఈ సందర్భంగా రాజు వేగేశ్న మాట్లాడుతూ సిఫీ టెక్నాలజీస్ సంస్థ దేశంలో ఫార్చూన్ 500 కంపెనీల్లో ఒక్కటిగా ఉందని, దేశంలోని వివిధ నగరాల్లో ఉన్న అనేక కంపెనీలు, బ్యాంకులతో సహా నార్త్ అమెరికా, యునైటెడ్ కింగ్డమ్ మరియు సింగపూర్ లోని వివిధ కంపెనీలకు సిఫీ డేటా సర్వీసెస్ అందిస్తుందని మంత్రి లోకేష్ కు వివరించారు.
కంపెనీ విస్తరణ ప్రణాళికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాల గురించి ఆయన లోకేష్ తో చర్చించారు. విశాఖపట్నం లో మెగా డేటా సెంటర్ మరియు కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటు పై ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రస్తుతం ఉన్న అవకాశాలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా ప్రభుత్వం అందిస్తున్న సేవలు, నూతనంగా తీసుకొచ్చిన ఐటీ పాలసీల గురించి నారా లోకేష్ వివరించారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు సిఫీ ఛైర్మెన్ రాజు వేగేశ్న సుముఖత వ్యక్తం చేసారు. ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు తో చర్చించి తదుపరి ప్రణాళికలు సిద్ధం చెయ్యాలని సిఫీ ప్రతినిధులను లోకేష్ కోరారు.