2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్న సంగతి తెలిసిందే. అయినా సరే పోయేవారు పోతారు ఉండేవారు ఉంటారు అన్న రీతిలోనే జగన్ ధోరణి ఉంది. బుజ్జగింపులు..వంటి కార్యక్రమాలు జగన్ చేయడం లేదు. దీంతో, వైసీపీ ఎమ్మెల్సీలు పార్టీని వీడి తమ దారి చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ త్వరలోనే టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. స్వయంగా ఈ విషయాన్ని మర్రి రాజశేఖర్ వెల్లడించారు.
జగన్ వైఖరితో విసుగు చెందానని, అందుకే వైసీపీకి రాజీనామా చేశానని మర్రి రాజశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశానని, అయినా సరే తనకు అవమానాలే ఎదురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో తాను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఆ సీటును మరో వ్యక్తికి ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తానని బహిరంగంగా హామీ ఇచ్చిన జగన్ మాట తప్పి మోసం చేశారని ఆరోపించారు. పార్టీలో తనకు గౌరవం దక్కలేదని వాపోయారు.
2019లో చిలకలూరిపేట నుంచి పోటీ చేసిన వ్యక్తి 2024లో గుంటూరులో పోటీ చేశారని పేర్కొన్నారు. సీటు వేరే వారికి కేటాయించినప్పుడు మాట మాత్రమైనా తనకు చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వసనీయత కోల్పోయిన జగన్ పద్ధతి నచ్చకే వైసీపీకి రాజీనామా చేశానని, త్వరలో టీడీపీలో చేరతానని చెప్పారు.