మాజీ వైసీపీ నేత, ప్రస్తుత టీడీపీ నేత రఘురామకృష్ణరాజుపై జగన్ సర్కార్ కస్టోడియల్ టార్చర్ కు పాల్పడిన వైనం అప్పట్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. కస్టోడియల్ టార్చర్ సమయంలో ఆనాడు తప్పుడు మెడికల్ రిపోర్ట్ ఇచ్చినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ పద్మావతి సీఐడీ విచారణకు హాజరుకావాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ నెల 7, 8 తేదీల్లో విచారణకు రావాలని ఆదేశించింది. అంతేకాదు, విచారణకు సహకరించకుంటే మధ్యంతర రక్షణ రద్దవుతుందని వార్నింగ్ ఇచ్చింది. ఈ కేసులో తదుపరి విచారణను ఏప్రిల్ 15కి వాయిదా వేసింది.
ఈ కేసు విచారణలో ప్రభుత్వం తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. డాక్టర్ ప్రభావతి విచారణకు సహకరించని వైనాన్ని సాక్షాధారాలతో సహా కోర్టు ముందుకు తెచ్చారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కావాలని డాక్టర్ పద్మావతి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిని హైకోర్టు తిరస్కరించడంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో, పద్మావతికి సుప్రీంకోర్టు మధ్యంతర రక్షణ కల్పించింది. దాంతోపాటు, విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
కానీ, పద్మావతి విచారణకు హాజరుకావడం లేదని, అందుకే ఆమెకు గతంలో ఇచ్చిన మధ్యంతర రక్షణను తొలగించాలని సుప్రీంకోర్టులో ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. దీంతో, విచారణకు హాజరుకాకుంటే మధ్యంతర రక్షణను తొలగిస్తామని సుప్రీం కోర్టు హెచ్చరించింది.