దేశ రాజధాని ఢిల్లీలో 27 ఏళ్ల తర్వాత కమలం వికసించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. 12 ఏళ్లుగా ఢిల్లీని పాలించిన ఆప్ కి బీజేపీ చెక్ పెట్టింది. భారీ ఆధిక్యంతో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా దూసుకెళ్తుండగా.. ఆప్ ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది. మరోవైపు కాంగ్రెస్ కనీసం ఖాతా కూడా తెరవలేదు. ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం.. బీజేపీ 48 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆప్ 23 స్థానాల్లో మాత్రమే లీడ్ ఉంది.
ఈ సారి ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ఫలితాలు క్షణ క్షణం ఉత్కంఠ రేపాయి. గెలుపు కోసం ఆప్, బీజేపీ గట్టిగా తలపడగా.. ఢిల్లీ ఓటర్లు ఇక పాలించింది చాలు అంటూ ఆమ్ ఆద్మీకి రెస్ట్ ఇచ్చారు. కేజ్రీవాల్ తన శక్తినంతా ఒడ్డించినా ఫలితం లేకుండా పోయింది. మద్యం కుంభకోణం ఆరోపణలు ఎదుర్కొన్న అగ్ర నేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యందర్ జైన్ ముగ్గురూ బీజేపీ అభ్యర్థుల చేతుల్లో ఖేల్ ఖతం అయ్యారు. కేజ్రీవాల్పై మాజీ సీఎం కొడుకు సాహిబ్ సింగ్ కుమారుడు పర్వేశ్ వర్మ విజయం సాధించగా.. మనీష్ సిసోడియాను తర్వీందర్సింగ్, సత్యందర్ జైన్ను కర్నాల్ సింగ్ ఓడించారు.
ఇక ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై కేజ్రీవాల్ స్పందించారు. ఎన్నికల్లో విజయం అందుకున్న బీజేపీకి శుభాభినందనలు.. ప్రజల తీర్పును వినమ్రంగా అంగీకరిస్తున్నాం. ప్రజా నిర్ణయాన్ని శిరసావహిస్తామని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని.. ఎన్నికల్లో ఓడిపోయినా ప్రజల వెంటే ఉంటామని మాజీ ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో గట్టిగా తలపడిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఈ సందర్భంగా కేజ్రీవాల్ ధన్యవాదాలు తెలిపారు.