ఏపీ మాజీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ ఆరేళ్లుగా కొనసాగుతూ ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ కేసులో సాక్షులు చనిపోతున్న వైనం కూడా చర్చనీయాంశమైంది. దీంతో, ఈ కేసును తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని వివేకా కూతురు సునీత కోరారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ కేసు గురించి ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి బెయిల్ పై బయట ఉన్నారని, ఆయన సాక్షులను బెదిరిస్తున్నారని షాకింగ్ ఆరోపణలు చేశారు. వివేకా హత్య కేసులోని సాక్షులు ఒక్కొక్కరుగా ప్రాణాలు కోల్పోతున్నారని, సునీత ప్రాణాలకు కూడా రక్షణ లేదని షర్మిల విమర్శలు గుప్పించారు. సునీతను ఏమైనా చేస్తారేమోనన్న భయం తమలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితం తనకు కొన్ని విషయాలు తెలిశాయని, అవి తనను ఆలోచింపజేస్తున్నాయని చెప్పారు. సునీతకు ఇద్దరు పిల్లలు ఉన్నారని అన్నారు.
అవినాశ్ బెయిల్ రద్దు చేయాలని అఫిడవిట్ దాఖలైందని, విచారణ అధికారులను బెదిరించినట్టు అందులో ఉందని ఆరోపించారు. తప్పుడు రిపోర్టుపై అధికారులతో అవినాశ్ సంతకాలు చేయించినట్టు తెలిసిందని సంచలన ఆరోపణలు చేశారు. అవినాశ్ బెయిల్ మీద బయట ఉండటం వల్లే సునీతకు న్యాయం జరగడం లేదని ఆరోపించారు. వివేకాను సునీత, ఆమె భర్త చంపించినట్టు తప్పుడు రిపోర్టు ఇచ్చారని అన్నారు.