వైసీపీ మాజీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి తాజాగా వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఏపీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో సిట్ అధికారుల ఎదుట శుక్రవారం విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జగన్ కోటరీ గురించి మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై రియాక్ట్ అయిన వైవీ.. వైసీపీని వీడాక పార్టీపై ఏదోరకంగా అభియోగాలు మోపాలని సాయిరెడ్డి చూస్తున్నారంటూ దుయ్యబట్టారు.
వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు చక్రం తిప్పింది ఎవరు.. విజయసాయిరెడ్డి కాదా? పార్టీలో కోటరీ ఉందో, లేదో ఆయనకు తెలియదా? అని వైవీ ప్రశ్నించారు. పదే పదే కోటరీ అంటున్నారు.. కోటరీ నడిపింది ఎవరో ఆయనకు తెలియదా? అని సాయిరెడ్డిపై వైవీ ఫైర్ అయ్యారు. వైసీపీలో నెంబర్ 2 నుంచి 2 వేల స్థానానికి పడిపోయానని విజయసాయి రెడ్డి అంటున్నారు.. కానీ అసలు పార్టీలో నెంబర్ 2 అనేదే లేదని నెంబర్ వన్ నుంచి 100 వరకు అన్నీ జగనేనని వైవీ సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు.
తమ ప్రభుత్వంలో ఎలాంటి స్కాములు జరగలేదని.. కావాలనే కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి తమను ఇబ్బందులకు గురిచేస్తుందని వైవీ సుబ్బారెడ్డి ఆరోపణలు చేశారు. లిక్కర్ స్కామ్ పేరుతో భయపెట్టి కొందరిని లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారని.. ఎన్ని కేసులు పెట్టినా కోర్టులో నిజం నిరూపించుకుంటామని వైవీ అన్నారు. కాగా, శుక్రవారం సిట్ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన విజయసాయిరెడ్డి.. 2014 నవంబర్ నుంచి 2019 మేలో అధికారంలో వచ్చే వరకు వైసీపీని ముందుకు తీసుకెళ్లడంలో ఎంతగానో కష్టపడ్డానని.. కానీ, గతంలో తాను చెప్పిన కోటరి ఏదైతే ఉందో అది జగన్ కు తనను ఒక వెన్నుపోటుదారుడుగా ప్రొజెక్ట్ చేసిందని, మీ స్థానంలో కూర్చొంటాడని పదే పదే చెబుతూ ఆయన మనసు మార్చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కోటరీనే మీరు అనుకునే రెండో స్థానం నుంచి తగ్గించుకుంటూ తనను 2 వేల స్థానంలో నిలబెట్టిందని సాయిరెడ్డి ఆరోపించారు. చాలా అవమానాలు ఎదుర్కొన్నాని.. కోటరీ వేధింపులు భరించలేక, జగన్ మనసులో చోటును కోల్పోయి.. పార్టీని వీడానని సాయిరెడ్డి చెప్పుకొచ్చారు.