మాజీ సీఎం జగన్ పై బీజేపీ నేత, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ను రాజకీయాలలో లేకుండా చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. జమ్మూ కశ్మీర్ టెర్రరిస్టుల కంటే ఇక్కడున్న నేతలు ఇంకా డేంజర్ అంటూ పరోక్షంగా వైసీపీ నేతలపై షాకింగ్ కామెంట్లు చేశారు. వైసీపీ త్వరలోనే కుప్పకూలుతుందని, వైసీపీకి ఈ సారి 11 సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. సిమెంట్ పరిశ్రమల నుంచి వైసీపీ నేతలు లబ్ది పొందారని ఆరోపించారు. తనపై వైసీపీ నేతలతో పాటు ఒక వర్గం మీడియా బురద చల్లేందుకు ప్రయత్నిస్తుందని ఆదినారాయణరెడ్డి అన్నారు.
సిమెంటు ఫ్యాక్టరీలకు సంబంధించిన కాంట్రాక్టుల విషయంలో ఇప్పటికీ వైసీపీ నేతల మాట చెల్లుబాటు అవుతోందని ఆదినారాయణ రెడ్డి వాదిస్తున్నారు. ఆ కాంట్రాక్టులకు గడువు ఉందని.. అది ముగిసిన వెంటనే కూటమి నేతలకు కాంట్రాక్టులు అప్పగిస్తామని చెబుతున్నారు అన్నారు. సిమెంట్ ఫ్యాక్టరీలను మామూళ్ల కోసం, కాంట్రాక్టుల కోసం బెదిరిస్తున్నారని తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, వాటిని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. జగన్ కోరికలేవీ నెరవేరవని, లిక్కర్ కేసులో కసిరెడ్డి దొరికాడని, జగన్ సహా అందరి బండారం బయటపడుతుందని జోస్యం చెప్పారు. చెట్టే రాలిపోతుంటే ఇక ఆకులు, ఈకలు ఏం ఉంటాయని ఎద్దేవా చేశారు.
గత కొద్దిరోజులుగా ఆదినారాయణ రెడ్డి, సీఎం రమేష్ మధ్య విభేదాలు నడుస్తున్న నేపథ్యంలో ఓ అదృశ్య శక్తి ఎక్కడో ఉండి ఇక్కడ శాసించడం ఏంటని ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యానించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆదినారాయణ రెడ్డి తీరుపై బీజేపీతో పాటు టీడీపీ, జనసేన నేతలు సానుకూలంగా లేరు.