వైసీపీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను అధినేత జగన్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. కుటుంబ కలహాలు రోడ్డుకెక్కడం, పార్టీ లైన్ దాటడం, దివ్వెల మాధురితో రిలేషన్ షిప్ వంటి వ్యక్తిగత వ్యవహారాల నేపథ్యంలో దువ్వాడపై వేటు పడింది. దువ్వాడ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు ఫిర్యాదులు రావడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని వైసీపీ అధిష్టానం ప్రకటించింది.
ఈ క్రమంలోనే తన సస్పెన్షన్ పై దువ్వాడ తొలిసారి స్పందించారు. ఈ సందర్బంగా దువ్వాడ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం చాలా కష్టపడ్డానని, అకారణంగా తనను పార్టీ నుంచి సస్పెండ్ వాపోయారు. వ్యక్తిగత కారణాలను బూచిగా చూపించి రాజకీయ క్రీడలో తనను బలిపశువును చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఏనాడూ పార్టీకి ద్రోహం చేయలేదని, అయినా సరే తనను సస్పెండ్ చేయడం బాధించిందని చెప్పారు. అయితే, ఈ సస్పెన్షన్ను తాత్కాలిక రాజకీయ విరామంగా భావిస్తానని చెప్పారు.
తటస్థుడిగా ఉంటూ తన అభిమానుల కోసం రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తానని తెలిపారు. అన్నిటికీ కాలమే సమాధానం చెబుతుందని దువ్వాడ వేదాంత ధోరణిలో మాట్లాడారు. అయితే, దువ్వాడ సస్పెన్షన్ వెనుక వేరే బలమైన కారణం ఉందని ప్రచారం జరుగుతోంది. దువ్వాడ కుటుంబ కథా చిత్రమ్, ప్రేమ కథా చిత్రమ్ రోడ్డున పడి చాలాకాలం అయింది. ఒకవేళ ఈ కారణాలతో ఆయనపై వేటు వేయాలంటే చాలాకాలం క్రితమే జరిగి ఉండేది. మంత్రి లోకేష్ను దువ్వాడ, మాధురిలు పొగిడిన నేపథ్యంలోనే హఠాత్తుగా దువ్వాడపై ‘క్రమ శిక్షణ’ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఒక ఇంటర్వ్యూ సందర్భంగా బాలయ్య తర్వాత స్వీటెస్ట్ పర్సన్ లోకేష్ అని దువ్వాడ, మాధురి ముక్తకంఠంతో సమాధానమిచ్చారు. తెలివైన లోకేష్ కు ముఖ్యమంత్రి పదవి ఇస్తే అభివృద్ధి చేస్తారని, యువకుడనీ ఈ ఇద్దరూ కొనియాడారు. కేవలం ఆ కారణంతోనే పార్టీ నుంచి దువ్వాడను సస్పెండ్ చేశారని, అకారణంగా కాదని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.