ప్రముఖ తెలుగు సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే, సీఎం చంద్రబాబు బావమరిది నందమూరి బాలకృష్ణకు సంబంధించి ఓ వార్త గత మూడు రోజులుగా నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. రాష్ట్ర రాజధాని అమరావతిలో బాలయ్య 200 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశాడంటూ వైసీపీ విస్తృతంగా ప్రచారం చేస్తుంది. అమరావతికి సమీపంలోని పెదపరిమి, హరిశ్చంద్రపురం గ్రామాల్లో బాలయ్య భారీగా భూములు కొన్నారని.. వీటిని త్వరలో ప్రభుత్వం సేకరించబోతోందని తెలిసే భూములు కొని లాభపడే ప్రయత్నం చేశారని ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేస్తున్నారు.
ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా వేడి పుట్టిస్తుండటంతో.. బాలయ్య అనుచరలు రంగంలోకి దిగారు. బాలయ్య 200 ఎకరాలు కొనుగోలు చేశారనే వార్తలు పూర్తిగా అవాస్తవమని.. అమరావతి అభివృద్ధిపై బురద చల్లడానికే వైసీపీ ఇటువంటి ఫేక్ ప్రచారం చేస్తుందని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. పెదపరిమి, హరిశ్చంద్రపురం గ్రామాలు ఇప్పటికే రాజధాని పరిధిలో ఉన్నాయని స్పష్టం చేశారు.
ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తుట్లుగా బాలయ్య ఎక్కడా 200 ఎకరాల భూమి కొనలేదని.. కావాలంటే రెవెన్యూ వెబ్ సైట్ లో ఆయన పేరు మీద ఎంత భూమి ఉందో చెక్ చేసుకోవచ్చని కూడా బాలయ్య అనుచరులు ఛాలెంజ్ చేశారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా.. ముఖ్యమంత్రి తన బావనే అయినా.. బాలయ్య ఎప్పుడూ ప్రభుత్వ వ్యవహారాల్లో అతిగా జోక్యం చేసుకోలేదని, అధికార బలాన్ని వ్యక్తిగత ప్రయోజనాల కోసం వినియోగించలేదని ఈ సందర్భంగా ఆయన అనుచరులు గుర్తు చేస్తున్నారు. నటుడిగా సంపాదించిన వనరులతోనే జీవితాన్ని గడుపుతున్నారు.. తన సొంత డబ్బుతో తల్లి బసవతారకం పేరున క్యాన్సర్ ఆస్పత్రి నిర్వహిస్తున్నారు.. అటువంటి బాలయ్యకు రాజకీయ అవినీతికి పాల్పడాల్సిన అవసరం లేదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.