ఏపీఎస్ ఆర్టీసీ బస్సు మహిళలకు ఉచిత ప్రయాణం పథకం అమలు కోసం రాష్ట్రంలోని ఆడపడుచులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఆ పథకం అమలు వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. ఈ క్రమంలోనే ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. అవసరమైతే ఆగస్టు 15న నుంచి ఆ పథకం అమలు చేస్తానని చంద్రబాబు ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవాన తప్పకుండా ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని చంద్రబాబు వెల్లడించారు.
కర్నూలులో జరిగిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పచ్చదనం, పరిశుభ్రత పెంపొందించాలని పిలుపునిచ్చారు. అంతేకాదు, రాష్ట్రవ్యాప్తంగా ప్రతి చోటా ప్రతి నెలా మూడో శనివారం ఇళ్లు, ఆఫీసులు, పరిసరాల పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని అన్నారు. ఏపీలో 125 రైతు బజార్లున్నాయని, మొత్తం 175 నియోజకవర్గాల్లో రైతు బజార్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఫ్రీ బస్ స్కీమ్ డేట్ ఫిక్స్ అని చంద్రబాబు చేసిన ప్రకటనపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.