ఒకప్పుడు వైసీపీలో నంబర్ 2గా కొనసాగిన విజయసాయి రెడ్డి…ఇటీవల పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జగన్ కు విజయసాయి ఒకసారి కౌంటర్ ఇచ్చారు. క్రెడిబులిటీ లేని వారు పార్టీ వీడతారని జగన్ అనడంతో…తనకు విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్నాయి కాబట్టే ఎవరికీ, ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదని అన్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి జగన్ పై విజయసాయి సంచలన విమర్శలు చేశారు.
వైసీపీలో ఎన్నో అవమానాలు పడ్డానని, జగన్ చుట్టూ ఉన్న ఓ కోటరీ వల్లే తాను జగన్ కు దూరమయ్యానని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ మనసులో తనకు చోటు లేదని తెలిసిన తర్వాతే పార్టీ వీడాలని నిర్ణయించుకున్నానని అన్నారు. కోటరీ మాటలు వినొద్దని జగన్కు ఎన్నోసార్లు చెప్పినా ఆయన వినలేదని కీలక వ్యాఖ్యలు చేశారు.
‘‘భయం అనేది నా బ్లెడ్లోనే లేదు. ఎవరికీ భయపడే రకం కాదు. గతంలో నాయకుడిపై భక్తి, గౌరవం ఉండేది.. ఇప్పుడు ఆ భక్తి దేవుడి మీద ఉంది. జగన్ నాకు పదవులు ఇచ్చాడు కాదనను..’’అంటూ జగన్ పై విజయసాయి షాకింగ్ కామెంట్లు చేశారు.
కోటరీ నుంచి జగన్ బయటకు రావాలని, అప్పుడే జగన్ భవిష్యత్తు బాగుంటుందని అన్నారు. ఈ ఆరోపణల వెనుక జగన్ ప్రమేయం లేదని తాను నమ్ముతున్నానని స్పష్టం చేశారు. జీవితంలో మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనని చెప్పారు. జగన్ మనసులో తనకు స్థానం లేదని, అందుకే పార్టీని వీడానని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.
కాకినాడ సీ పోర్టు కేసు కొనసాగినా తనకు వచ్చిన నష్టమేమీ లేదని, కేవీరావుతో తాను మాట్లాడలేదని, అలా చెబుతున్న వారు దానిని నిరూపించాలని సవాల్ విసిరారు. వాళ్లు ఎదిగేందుకు తనకూ, జగన్కు విభేదాలు సృష్టించారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంలో పాత్రధారుల గురించి సమయం వచ్చినప్పుడు మాట్లాడతానని అన్నారు. ఈ రోజు ఆ కేసులో విజయసాయి సీఐడీ విచారణకు హాజరైన తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు.