ఏ చిన్న అవకాశం లభించినా… మధ్యవర్తి పాత్రను పోషించేందుకు.. పెద్దన్న పాత్ర ఇవ్వాల్సిందిగా కోరేందుకు అస్సలు మొహమాటపడని అగ్రరాజ్యం అమెరికా తీరులో మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. దీనికి తాజాగా ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పందిస్తున్న తీరే నిదర్శనంగా చెప్పాలి. భారత్.. పాక్ తాజా పరిణామాలపై బుధవారం స్పందించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. రెండు దేశాలకు సమ ప్రాధాన్యతను ప్రదర్శించటం తెలిసిందే.
అందుకు భిన్నమైన ధోరణిని గురువారం (అమెరికా కాలమానం ప్రకారం) అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పందించారు. ఒకలాంటి నిష్టూరంతో మాట్లాడిన ఆయన.. భారత్.. పాక్ మధ్య పెరిగిపోతున్న ఉద్రిక్తతలపై తనకున్న అసంత్రప్తిని వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పాలన్న మాట తప్పించి.. ఇరు దేశాల మధ్య యుద్ధం జరగకుండా తాము ఆపలేమని.. భారతీయులను ఆయుధాలను వదులుకోమని తాము చెప్పలేమని వ్యాఖ్యానించటం గమనార్హం.
అదే సమయంలో పాక్ ను ఉద్దేశించి ఇదే తరహా వ్యాఖ్యలు చేసిన వాన్స్.. ‘ఈ పరిస్థితుల్లో మనం చేయగలిగింది ఒక్కటే. ఇరువురు సంయమనం పాటించాలని కోరటమే. ఇలాంటి సూచనలు చేయటం తప్పించి.. ఇరు దేశాలను నియంత్రించే సామర్థ్యం మాకు లేదు. సంబంధం లేని యుద్ధంలో మేమెందుకు భాగస్వామ్యం కావాలి? ఇదో ప్రాంతీయ యుద్ధంగా ఉండాలే తప్పించి.. అణు సంఘర్షణగా మారకూడదన్నది మా ఆలోచన.
వారిద్దరి విషయంలో మాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ మాటకు వస్తే.. సైద్ధాంతికంగా మాకేం సంబంధం’’ అంటూ ప్రశ్నించటం గమనార్హం. మొదట్లో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల నివారణకు తాము పెద్దరికం వహిస్తామని మాట్లాడిన ట్రంప్..తాజా పరిణామాల నేపథ్యంలో నోరు విప్పకుండా ఉండటం గమనార్హం.