బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా తాజాగా ఓ వింత కోరికను బయటపెట్టి వార్తల్లో నిలిచింది. ఐటెం సాంగ్స్ ద్వారా నార్త్ తో పాటు సౌత్ లోనూ పాపులర్ అయిన ఊర్వశి.. సెల్ఫీ డబ్బా కొట్టుకోవడంతో, షోఆఫ్ చేయడంలో ఎప్పుడూ ముందుంటదనే విమర్శలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఊర్వశీ రౌతేలా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.
ఉత్తరాఖండ్లో తన పేరు మీద ఆలయం ఉందంటూ ఊర్వశీ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ.. ` ఉత్తరాఖండ్లో నా పేరు మీద ఓ ఆలయం ఉంది. బద్రీనాథ్కు పక్కనే నా గుడి ఉంటుంది. ఎవరైనా బద్రీనాథ్కు వెళితే ఈ గుడిని కూడా సందర్శించండి. ఢిల్లీ యూనివర్సిటీ లో నా ఫొటోలకు పూలమాలలు వేసి పూజిస్తారు. నన్ను దండమమాయి అని పిలుస్తారు. అది తెలిసి నేనే ఆశ్చర్యపోయాను. ` అంటూ ఊర్వశీ పేర్కొంది.
అక్కడితో ఆగకుండా.. `టాలీవుడ్ టాప్ స్టార్స్ చిరంజీవి, పవన్ కల్యాణ్, బాలకృష్ణలతో కలిసి నటించాను. దక్షిణాదిలో కూడా నాకు భారీగా అభిమానులు ఉన్నారు. అందుకే దక్షిణ భారతదేశంలోనూ నాకో ఓ ఆలయాన్ని నిర్మించాలని ఆశిస్తున్నా` అంటూ ఊర్వశీ తన మనసులో ఉన్న వింత కోరికను బయటపెట్టింది. దాంతో నెటిజన్లు ఆమెను ట్రోల్ చేయడం షురూ చేశారు. ఊర్వశీ తన గురించి తాను మరీ ఎక్కువగా ఊహించుకుంటుందని.. ఆమెకు గుడి కట్టి ఆరాధించేంత అభిమానులు సౌత్ లో ఏమీ లేరని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.