ఎంత మంది పోలీసులు ఉన్నా, ఎన్ని చట్టాలు వస్తున్నా దేశంలో నేరాలు మాత్రం తగ్గడం లేదు. తాజాగా కడప లో దారుణం చోటుచేసుకుంది. కువైట్ నుంచి వచ్చి మరీ అల్లుడిని హత్య చేశాడో మామ. అది కూడా అత్యంత కిరాతకంగా. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆర్కే నగర కు చెందిన చాంద్ బాషా దాదాపు తొమ్మిదేళ్ల క్రితం అశోక్ నగర్ లో నివాసం ఉంటున్న మహబూబ్ బాషా కుమార్తె ఆయేషాను వివాహం చేసుకున్నాడు. మెహబూబ్ బాషా కువైట్ లో పని చేస్తాడు. చాంద్ బాషా గతంలో నిషేధిత ఉగ్రవాద సంస్థ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడిగా వర్క్ చేశాడు.
అయితే ఆయేషాతో వివాహం తర్వాత చాంద్ బాషా కొద్ది రోజులు బాగానే ఉన్నాడు. కానీ ఆ తర్వాత భార్యపై వేధింపులకు పాల్పడటం ప్రారంభించాడు. దాంతో ఆయేషా కుటుంబం పలుమార్లు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేయడం.. పోలీసులు చాంద్ బాషాకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా అతనిలో ఎటువంటి మార్పు రాలేదు. గత రెండు సంవత్సరాల నుంచి చాంద్ బాషా ఆయేషాను పూర్తిగా దూరం పెట్టేశాడు. ఇది ఆయేషా తండ్రి మెహబూబ్ బాషా ఏమాత్రం సహించలేకపోయాడు.
తన కూతురికి అన్యాయం చేసిన చాంద్ బాషాను ఎలాగైనా హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగానే ఇరవై రోజులు క్రితం కువైట్ నుంచి వచ్చిన మెహబూబ్ బాషా.. అల్లుడు హత్యకు ప్లాన్ రెడీ చేశాడు. ప్లాన్ ప్రకారం.. ఓ విందు కార్యక్రమంలో పాల్గొన్న చాంద్ బాషాను కాళ్లు చేతులు కట్టేసి కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఆపై అతన్ని మహబూబ్ బాషా ఇంటికి తీసుకెళ్లారు.
అక్కడ చాంద్ బాషాను వేట కొడవలితో విచక్షణ రహితంగా నరికి నరికి చంపేశాడు మహబూబ్ బాషా. హత్య అనంతరం మహబూబ్ బాషా తో పాటు మరి కొందరు వ్యక్తులు చిన్నచౌకు పోలీస్ స్టేషన్కు వెళ్లి నేరాన్ని ఒప్పుకుని లొంగిపోయారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం కు పంపిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చాంద్ బాషా మరణంతో అతని కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. కాగా, ఈ ఘటన కడప నగరంలో ప్రస్తుతం సంచలనంగా మారింది.