టాలీవుడ్ సీనియర్ నటుడు ‘శివాజీ’, కమెడియన్ ప్రియదర్శి, యువ నటీనటులు శ్రీదేవి, హర్ష్ రోషన్ కీలక పాత్రల్లో నటించిన ‘కోర్ట్’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ రేపుతోంది. దర్శకుడు రామ్ జగదీష్ తెరకెక్కించిన ఈ కోర్ట్ రూమ్ డ్రామాకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. టాలీవుడ్ హీరో నాని నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం విడుదలైన 7 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 39.60 కోట్లు కొల్లగొట్టి 50 కోట్ల వైపు దూసుకుపోతోంది.
అమెరికాలో కోర్ట్ చిత్రం ‘1 మిలియన్ డాలర్ క్లబ్’ లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ‘నెవర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్’ అన్న రీతిలో అమెరికాలో రెండో వారంలో కూడా దాదాపు 50 థియేటర్లలో హౌస్ ఫుల్ బుకింగ్స్ తో రన్ అవుతోంది. 11 కోట్లు పెట్టి నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే బ్రేక్ ఈవెన్ సాధించింది. ఈ చిత్రం ఓటీటీ హక్కులు, మ్యూజికల్ రైట్స్ ద్వారా ఇప్పటికే భారీ మొత్తంలో బిజినెస్ చేసిందని టాక్.
ముఖ్యంగా ఈ చిత్రంలో ‘మంగపతి’ పాత్రలో ‘శివాజీ’ తన నటనతో ‘శివ తాండవం’ చేశారు. ‘మంగపతి’ పాత్రలో జీవించిన ‘శివాజీ ‘తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను థియేటర్లకు క్యూ కట్టేలా చేస్తున్నారు. పాతికేళ్ల తన కెరీర్ లో ‘మంగపతి’ పాత్ర చిరస్థాయిగా నిలిచిపోతుందని, ఇటువంటి పాత్ర కోసం పాతికేళ్లుగా ఎదురుచూస్తున్నానని ‘శివాజీ’ అన్న సంగతి తెలిసిందే.
‘మంగపతి’ పాత్రతో పాటు ‘‘90’s ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’’ చిత్రంలో ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఓ సగటు మధ్య తరగతి తండ్రి పాత్రలో ‘శివాజీ’ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ‘మంగపతి’, ‘చంద్ర శేఖర్’ రెండు పాత్రల్లో ‘శివాజీ’ నటించిన తీరు ఈ తరం ప్రేక్షకులను సైతం కట్టిపడేసింది. ఇక, ఓటీటీ ప్లే అవార్డ్స్ 2025 బెస్ట్ వెబ్ సిరీస్’ కేటగిరీలో ’90’s ఎ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ నామినేట్ అయింది.