ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సొంత సంస్థ.. కార్ల దిగ్గజ కంపెనీ టెస్లా.. భారత్లోకి వచ్చేందుకు రెడీ అయింది. భారత్లో విడి భాగాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కొన్నాళ్ల కిందటే టెస్లా ప్లాన్ చేసుకుంది. దీంతో తమ రాష్ట్రానికి రావాలంటే తమ రాష్ట్రానికి రావాలంటూ.. పలు రాష్ట్రాల ముఖ్యమం త్రులు టెస్లాకు ఆహ్వానం పలికారు. ఈ వరుసలో ఏపీ కూడా ఉంది. సీఎం చంద్రబాబు టెస్లా అధినేతను ఉద్దేశించి ఎక్స్లో విజ్ఞప్తి కూడా చేశారు.
అయితే.. బీజేపీ పాలిత రాష్ట్రాల వైపే టెస్లా అధినేత మొగ్గు చూపుతున్నట్టు కొన్నాళ్లుగా అనుమానాలు ఉన్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో మస్క్కు ఉన్న పరిచయాలు.. ఆయన పట్ల ఉన్న విధేయత కారణంగా.. టెస్లా.. కంపెనీని బీజేపీ పాలిత రాష్ట్రాలకు కేటాయించే అవకాశం ఉందని జాతీయ మీడియా కూడా అనుమానాలు వ్యక్తం చేసింది. ఇప్పుడు ఖచ్చితంగా అదే జరగబోతున్న సంకేతాలు బయటకు వచ్చాయి.
మహారాష్ట్రకు టెస్లా కంపెనీ రానున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన లేకపోయినా.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి.. మహారాష్ట్రలోని ముంబై ప్రాంతానికి శివారులో టెస్లా కోసం వేలాది ఎకరాలను అక్కడి బీజేపీ-శివసేన(షిండే) కూటమి ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధిం చిన వీడియోలు వెలుగు చూశాయి. ముంబై మహానగరం కావడం.. ప్రపంచ స్థాయిలో పెట్టుబడులకు కూడా వేదిక కావడంతో పాటు తీర ప్రాంతం కూడా చేరువలో ఉండడం గమనార్హం.
దీంతో మస్క్ ఇక్కడ ముచ్చటపడు తున్నట్టు సమాచారం. దీనికి తోడు ప్రధాని మోడీ కూడా ముంబైని సూచించి ఉంటారన్న చర్చా ఉంది. తాజాగా మోడల్ వై కారును ముంబై శివారులో సర్కారు కేటాయించనున్నట్టు ప్రచారం జరుగుతున్న ప్రాంతంలో పరీక్షించడం గమనార్హం. సో.. దీనిపై త్వరలోనే అధికార ప్రకటన రావొచ్చన్నది మీడియా వర్గాల కథనం.