భారత్-పాక్ మధ్య జరుగుతున్న దాడుల్లో(దీనిని యుద్ధమని భారత ప్రభుత్వం ప్రకటించలేదు) తెలుగు రాష్ట్రానికి చెందిన జవన్ వీర మరణం చెందారు. భారత్ తలపెట్టిన `ఆపరేషన్ సిందూర్`కు ప్రతీకారంగా పాకిస్థాన్ వైపు నుంచి కూడా దాడులు ప్రారంభమయ్యాయి. గురువారం రాత్రి.. జమ్ముకశ్మీర్ లోని కుప్వారా ప్రాంతంలో పాక్ సైనికులు రెచ్చిపోయి మరీ భారత్ జవాన్లపై కాల్పులకు తెగబడ్డారు.
ఈ క్రమంలో ఏపీలోని సత్య సాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం పరిధిలోని గోరంట్లకు చెందిన మురళీ నాయక్ వీర మరణం చెందినట్టు ఆర్మీ ప్రకటించింది. ప్రస్తుతం సరిహద్దుల వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఒకవైపు గగనతలంలోనూ.. మరో వైపు భూమిపై కూడా దాడులు జరుగుతున్నాయి. జమ్ము కశ్మీర్లోని సుమారు ఐదు ప్రాంతాల్లో పాక్ సైనికులు రెచ్చిపోతున్నారు. వీరిని కట్టడి చేసే క్రమంలో భారత్ వైపు నుంచి కూడా దీటుగా కాల్పులు జరుగుతున్నాయి.
గురువారం రాత్రి కుప్వారా జిల్లాలో జరిగిన కాల్పుల్లో సత్య సాయి జిల్లా గోరంట్ల మండలం పుట్టగుండ్లపల్లి తాండా శ్రీరామ్ నాయక్ కుమారుడు మురళి నాయక్ అమరులైనట్టు ఆర్మీ అధికారులు ప్రకటించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వీర సైనికుడు మురళీ నాయక్ పేరిట ఓ ప్రకటన విడుదల చేశారు. అంతిమ సంస్కారాల కోసం.. మురళీ నాయక్ పార్థివ దేహాన్ని ప్రత్యేక విమానంలో ఉమ్మడి అనంతపురం తీసుకువస్తారు.
అక్కడ నుంచి స్వస్థలానికి తరలించి.. అంతక్రియలు నిర్వహించనున్నారు. కాగా.. శ్రీరామ్ నాయక్ కుటుంబంలో ఒకే ఒక్క సంతానమైన మురళి.. స్థానికంగా ఇంటర్ పూర్తి చేశారు. అనంతరం దేశం కోసం ఆర్మీలో జాయిన్ అయ్యారు. మురళీ నాయక్ వీర మరణం పట్ల ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.