వైసీపీ కీలక నాయకుడు, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి పట్టిన పట్టు వీడడం లేదు. అవసరమైతే.. జైలుకు కూడా వెళ్తానని చెబుతున్నారు. తిరుపతిలోని తిరుమల శ్రీవారి దేవస్థానానికి అనుబంధంగా ఎస్వీ గోశాలను నిర్వహిస్తున్నారు. అయితే.. దీనిలో అక్రమాలు జరుగుతున్నాయని.. గోవులు మృతి చెందుతు న్నాయని ఆరోపిస్తూ.. గత వారం రోజులుగా భూమన యాగీచేస్తున్న విషయం తెలిసిందే. టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ కావడంతో ఈయన వ్యాఖ్యలకు ప్రాధాన్యం పెరిగింది. అయితే.. దీనిని బలంగా తిప్పి కొట్టే ప్రయత్నం టీడీపీ తో పాటు టీటీడీ కూడా చేసింది.
చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావులు.. మీడియా ముందుకు వచ్చి.. ఏం జరగలేదని చెప్పుకొచ్చారు. పైగా భూమన ఆరోపించి నట్టు 100 గోవులు కాదని.. కేవలం 43 గోవులు మాత్రమే చనిపోయాయన్నారు. అది కూడా అనారోగ్యం.. ఇతర సమస్యలతోనే జరిగిందని చెప్పుకొచ్చారు. అదేసమయంలో వైసీపీ హయాంలోనే భారీ ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయని తెలిపారు.
ఈ వ్యవహారంపై భూమన పట్టు వదలకుండా ప్రవర్తిస్తున్నారు. తాను ఎట్టి పరిస్థితిలోనూ నిజాలు నిరూపి స్తానని కూడా అంటున్నారు. ఈ క్రమంలోనే మరిన్ని వ్యాఖ్యలతో రెండు రోజుల కిందట మీడియా ముందు కు వచ్చారు. అయినప్పటికీ.. టీటీడీ మాత్రం వైసీపీ హయాంలోనే తప్పులు జరిగాయంటూ.. విజిలెన్స్ నివేదికలను వెల్లడించింది. ఈ క్రమంలోనే భూమనపైనా కేసు పెట్టాలని నిర్ణయించి.. టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్రెడ్డితో ఫిర్యాదుచేయించారు.
అయితే.. ఇప్పుడు కేసునమోదు విషయంలో టీడీపీ నాయకులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.భూమనపై కేసు పెట్టి జైలుకు పంపిస్తే.. ఆయనకు సింపతీ పెరుగుతుందని.. గోశాల వ్యవహారం మరింత రచ్చకెక్కు తుందని.. హిందూ సంఘాలు కూడా.. ఆయనకు మద్దతుగా నిలిచే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే భూమన విషయంలో ఆచి తూచి వ్యవహరించాలని సూచిస్తున్నారు. ఇదిలావుంటే.. తాజాగా భూమనను హౌస్ అరెస్టు చేయడం గమనార్హం.