ముఖ్యమంత్రి చంద్రబాబు అడ్డా అయిన కుప్పంలో వైసీపీకి దిమ్మతిరిగే షాక్ తగిలింది. విశాఖ, గుంటూరు కార్పొరేషన్లతో పాటు.. కుప్పం మున్సిపాలిటీ కూడా టీడీపీ ఖాతాలో పడిపోయింది. ఆఖరి నిమిషంలో చోటుచేసుకున్న నాటకీయ పరిణామాల నడుమ వైసీపీ అక్కడ పట్టు కోల్పోయింది. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా కుప్పంలో ఉత్కంఠ పరిస్థితి నెలకొంది.
కుప్పం మున్సిపాలిటీ చైర్మన్ స్థానాన్ని గెలుచుకోవడానికి అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ పోటాపోటీ పడ్డాయి. అయితే ఎన్నిక ప్రక్రియ చివరి నిమిషంలో వైసీపీకి చెందిన నలుగురు కౌన్సిలర్లు టీడీపీ గూటికి చేరారు. దాంతో ఒక్కసారిగా టీడీపీ బలం పెరిగింది. 24 మంది సభ్యుల్లో 14 మంది కౌన్సిలర్లు టీడీపీకి మద్దతు తెలిపారు. ఒక ఎమ్మెల్సీ ఓటు కూడా తోడవడంతో టీడీపీ బలపరిచిన అభ్యర్థికి అనుకూలంగా 15 ఓట్లు నమోదయ్యాయి.
మరోవైపు వైసీపీ నుంచి కేవలం 8 మంది కౌన్సిలర్లే ఎన్నికకు హాజరయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో కుప్పం మున్సిపల్ ఎన్నికలో వన్నియకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన సెల్వరాజు చైర్మన్ గా ఎన్నిక అయ్యారు. టీడీపీ అభ్యర్థి విజయం సాధించడంతో.. అధికార పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. ఇకపోతే గ్రేటర్ విశాఖ మేయర్గా టీడీపీ 96 వ వార్డు కార్పొరేటర్ పీలా శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే గుంటూరులోనూ మేయర్ పీఠం కూటమికే దక్కింది. 34 ఓట్లతో టీడీపీ అభ్యర్థిగా కోవెలమూడి రవీంద్ర అక్కడ గెలుపొందారు.