“నేను విధ్వంసాలకు దిగను. వైసీపీ మాదిరిగా కక్ష పూరిత రాజకీయాలు చేయను. ఎవరినైనా చట్టం ప్రకారం.. న్యాయం ప్రకారం.. కోర్టులో నిలబెడతాం.. శిక్ష పడే వరకు పోరాడతాం“ ఇదీ.. సీఎం చంద్రబాబు చెబుతున్న మాట. ఇటీవల కూడా ఆయన పల్నాడు జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఇదే చెప్పారు. మరి దీనిని అలుసుగా తీసుకున్నారో.. లేక టీడీపీ నేతలను ఏం చేసినా.. చంద్రబాబు చేతులు కట్టుకుని ఉంటారని భావిస్తున్నారో తెలియదు కానీ.. వైసీపీ నాయకులు క్షేత్రస్థాయిలో రెచ్చిపోతున్నారు.
ఈ విషయాన్నే తాజాగా తిరుపతి జిల్లాకు చెందిన టీడీపీనాయకులు ప్రశ్నిస్తున్నారు. సోమవారం పొద్దు పొ ద్దున్నే.. నాయకులు రోడ్డెక్కారు. తమకు అన్యాయం జరుగుతున్నా.. పట్టించుకోరా? ఇంత మెత్తగా ఉంటే .. మేం ఏం కావాలి? అని ప్రశ్నిస్తూ.. సీఎం చంద్రబాబును నిలదీశారు. దీంతో తిరుపతిలో ఏం జరిగిందో ఆరా తీసి.. తగిన న్యాయం చేయాలని.. అధికారులను ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించింది. ఇదిలావుంటే.. తిరుపతిలో బంద్కు.. టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు.
ఏం జరిగింది?
తిరుపతిలోని ఒకటో డివిజన్లో టీడీపీ ఇంచార్జ్ గా ఉన్న సీనియర్ నాయకుడు వెంకటేశ్ సోమవారం (ఈ రోజు) ఉదయం 6 గంటల సమయంలో దారుణ హత్యకు గురయ్యారు. ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చి.. సెంటర్లో టీ తాగేందుకు వేచి చూస్తున్న సమయంలో కొందరు దుండగులు ఆయనను వెనుక నుంచి బలంగా తన్నారు. కింద పడిపోయిన వెంకటేశ్పై.. కారం చల్లి వెంట తెచ్చుకున్న కత్తులతో దారుణంగా పొడిచి చంపారు. అయితే. చుట్టూ ఉన్నవారు భయభ్రాంతులకు లోనై.. అక్కడ నుంచి పరారయ్యారు.
ఈ ఘటన దావాలనంగా వ్యాపించడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. హత్య చేసిన వారు వైసీపీకి చెందిన వారేనని.. వైసీపీ నేత భూమన కుటుంబానికి కూడా సంబంధం ఉందని ఆరోపించారు. పార్టీలో యాక్టివ్గా ఉంటూ.. వైసీపీని నిలదీస్తున్నందునే.. వెంకటేశ్ను హత మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా.. సీఎం చంద్రబాబు మెత్తగా ఉండడంతోనే వైసీపీ హంతకులు రెచ్చిపోతున్నారని విమర్శించారు.