రాజకీయాలకు ఏదీ అతీతం కాదు. మనకు సరిపోక పోతే.. ఎవరు ఏం చేసినా.. తప్పే.. అది ముప్పే.. అన్న ట్టుగా నాయకులు వ్యవహరిస్తారు. ప్రస్తుతం తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్రసమితి(బీఆర్ఎస్)లోనూ నాయకుల పరిస్థితి అలానే ఉంది. ఈ నెల 27న పార్టీ 25 వసంతాల వేడుక(రజతోత్సవం)ను ఘనంగా నిర్వహించాలని భావించారు. దీనికి సంబంధించి.. సమయం చేరువ అవుతుండడంతో కొన్ని కమిటీలను ప్రాథమికంగా నియమించారు. అయితే.. ఈ నియామకాలే మరో రాజకీయానికి దారితీశాయి.
తమకు అవకాశం ఇవ్వకుండా.. మాజీలకు అవకాశం ఇవ్వడం ఏంటని.. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నవా రు.. ఎమ్మెల్సీగా ఉన్న బీఆర్ ఎస్ నాయకులు అంతర్గత వివాదాలకు, రాజకీయ చిచ్చుకు తెరదీశారు. హైదరాబాద్ నుంచి ఇతర జిల్లాల వరకు కూడా.. ఇదే వివాదాలు సాగుతున్నాయి. దీంతో రజతోత్సవం మాట ఎలా ఉన్నా.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాలతో బీఆర్ ఎస్లో కొత్త పంచాయతీలు తెరమీదికి వస్తున్నాయి.
ఈ నెల 27న వరంగల్లో బీఆర్ ఎస్ రజతోత్సవ సభను నిర్వహించాలనిభావించారు. దీనిపై కోర్టు విచా రణ సాగుతోంది. ఈలోగా కార్యకర్తలను ఐక్యం చేయడంతోపాటు..(భారీ సంఖ్యలో 10 లక్షల మంది టార్గెట్ పెట్టుకున్నారు) వారిని సభకు వచ్చేలా చేసేందుకు .. బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. కొందరికి మౌఖికంగా బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్కు.. కీలక బాధ్యత అప్పగించారు. అదేసమయంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావుకు కూడా ఇదే బాధ్యతలు అప్పగించారు.
అయితే.. అధికారంలో ఉన్న తనకు బాధ్యతలు అప్పగించకుండా.. కీలక బాధ్యతలను సత్యవతికి ఎలా అప్పగిస్తారన్నది రవీందర్రావు ప్రశ్న. అయితే.. ఆయన తన ఆవేశాన్ని దాచుకుని.. సత్యవతిపై మరో రూపంలో విమర్శలు గుప్పించారు. సమన్వయం చేయడంలో ఆమె విఫలమవుతున్నారన్న వాదన వినిపించారు. సమన్వయ కర్తగా సత్యవతి రాథోడ్ పార్టీ శ్రేణులను అందరిని కలుపుకొని పోవడం లేదని దుయ్యబట్టారు. అందరినీ ఒకే తాటిపై నడిపించే వారు కావాలని అన్నారు. ఇది వివాదంగా మారి.. సత్యవతి రాధోడ్ ఇంటికే పరిమితమయ్యారు. మొత్తానికి రజతోత్సవ వేడుకలు ఎలా ఉన్నా.. ఇలా అంతర్గత కుమ్ములాటలతో నాయకులు రోడ్డున పడడం మరో తలనొప్పిగా మారింది.