డైలాగ్ కింగ్ మోహన్ బాబు తనయుడు, టాలీవుడ్ యాక్టర్ మంచు విష్ణు తాజాగా ప్రభాస్ ను ఉద్ధేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. గత కొంత కాలం నుంచి విష్ణు `కన్నప్ప` మూవీతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి మోహన్ బాబు నిర్మాత. ఈ ఫ్యాంటసీ ఫిల్మ్ లో ప్రభాస్, కాజల్ అగర్వాల్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ వంటి స్టార్స్ భాగం అయ్యారు. మోహన్ బాబుపై అభిమానంతో ప్రభాస్ పైసా రెమ్యునరేషన్ తీసుకోకుండా ఈ సినిమాలో రుద్రుడిగా నటించారు.
ఇటీవలె షూటింగ్ కంప్లీట్ చేసుకున్న కన్నప్ప జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే తాజాగా ఓ ప్రమోషనల్ ఈవెంట్ లో ప్రభాస్ పై నోరు జారాడు మంచు విష్ణు. ఆయన మాట్లాడుతూ.. `నా దృష్టిలో ప్రభాస్ ఒక సాదాసీదా నటుడు మాత్రమే. లెజెండ్ యాక్టర్ కాదు. ప్రభాస్ లెజెండ్గా మారడానికి ఇంకా టైమ్ పడుతుంది. మోహన్లాల్ మాత్రం లెజెండరీ యాక్టర్. కాలం ఆయన్ను లెజెండరీ నటుడిని చేసింది. రాబోయే కాలంలో ప్రభాస్ చేసే సినిమాలు తప్పకుండా ఏదో ఒకరోజు ఆయన్ను లెజెండ్ను చేస్తాయి ` అంటూ వ్యాఖ్యానించారు.
అయితే ఈ వ్యాఖ్యల పట్ల ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ప్రాంతీయ స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన ప్రభాస్ కు మనదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ భారీ ఫ్యాన్ బేస్ ఉంది. బాలీవుడ్ హీరోలను మించి క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ మధ్య పలకరించిన వరుస విజయాలు ప్రభాస్ ను ఇండియన్ బాక్సాఫీస్ కింగ్గా నిలబెట్టాయి. అటువంటి డార్లింగ్ ను లెజెండ్ యాక్టర్ కాదని ఎలా అంటావంటూ విష్ణుపై ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.