ఆంధ్రుల కలల రాజధాని అమరావతి పనులను పున:ప్రారంభించేందుకు ఏపీ సర్కార్ సిద్ధమైన సంగతి తెలిసిందే. జగన్ హయాంలో బీడువారిన అమరావతి రాజధానికి ఆయువు పోసేందుకు సీఎం చంద్రబాబు నడుం బిగించారు. అమరావతి రైతులు రాజధాని కోసం భూములు ఇవ్వడమే కాకుండా వాటిని కాపాడుకునేందుకు వెయ్యి రోజులకు పైగా ఉద్యమం నడిపారు. అందుకే, వారికి తగిన గుర్తింపునివ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ చేతుల మీదుగా జరగబోతోన్న అమరావతి రీ లాంచ్ కార్యక్రమం సందర్భంగా కొందరు రైతులను సన్మానించాలని భావిస్తున్నారట.
మే 2న జరగబోతోన్న ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. సభా వేదిక ఏర్పాటు చేయబోతున్న ప్రాంతాన్ని అధికారులతో కలిసి నారాయణ పరిశీలించారు. గత ఐదేళ్లలో లక్షలాది మంది రైతులు తమ భూములు ఇచ్చినా రాజధాని నిర్మాణం కాలేదని ఎంతో ఆవేదన చెందారని, ఉవ్వెత్తున్న ఉద్యమించారని నారాయణ గుర్తు చేశారు. అటువంటి రైతులలో నలుగురిని ప్రధాని మోదీ సమక్షంలో సన్మానించాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారని నారాయణ అన్నారు.
రాబోయే అవసరాలను దృష్టిలో ఉంచుకుని అమరావతి అదనపు ల్యాండ్ పూలింగ్ గురించి ఆలోచిస్తున్నామని, దాని గురించి స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చిస్తున్నామని తెలిపారు. అయితే, ప్రజల అంగీకారంతోనే ల్యాండ్ పూలింగ్ ఉంటుందని, లేదంటే భూసేకరణ గురించి ఆలోచిస్తామని అన్నారు.
ప్రధాని మోదీ టూర్ లో లోటుపాట్లు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ప్రధాని పర్యటన కేవలం గంటన్నర మాత్రమే ఉంటుందని, భద్రతా కారణాల దృష్ట్యా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రధాని కాన్వాయ్ సాఫీగా సాగేందుకు 8 మార్గాలను గుర్తించామని, సభకు వచ్చే వాహనాల పార్కింగ్ కోసం 11 ప్రాంతాలు రెడీ చేస్తున్నామని తెలిపారు.