యుద్ధానికి కాలు దువ్విన పాకిస్తాన్ కు భారత్ చుక్కలు చూపిస్తోంది. దెబ్బ మీద దెబ్బ కొడుతూ పాక్ కు ఊపిరాడకుండా చేస్తోంది. టెర్రరిస్ట్ కుక్కలను ఊచకోత కోస్తోంది. అయితే భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణంలో ప్రజలను కలవరపెట్టే తప్పుడు వార్తలు సోషల్ మీడియాలో నిండిపోతున్నాయి. ఇప్పుడు చెప్పబోయే న్యూస్ కూడా ఈ కోవకు చెందిందే. పాకిస్తాన్ తో యుద్ధం నేపథ్యంలో భారత్ లో మూడు రోజుల పాటు ఏటీఎంలు బంద్ అన్నదే ఆ వార్త సారాంశం.
ర్యాన్సమ్వేర్ సైబర్ దాడి జరగొచ్చని, అందుకే రెండు నుంచి మూడు రోజులపాటు దేశవ్యాప్తంగా ఏటీఎంలను క్లోజ్ చేయబోతున్నారనే న్యూస్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ వాట్సాప్లో సర్క్యూలేట్ అవుతుంది. ఇది నిజమేమో అని చాలా మంది ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఏటీఎంలు క్లోజ్ కాకముందే కొంత డబ్బు డ్రా చేసుకోవాలనే ఉద్ధేశంతో పరుగులు తీస్తున్నారు.
అయితే ఈ వార్తపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ చేసి.. అందరికీ ఓ క్లారిటీ ఇచ్చింది. మూడు రోజుల పాటు ఏటీఎంలు బంద్ అంటూ వైరల్ అవుతున్న వార్తలో నిజం లేదని పీఐబీ స్పష్టం చేసింది. ఆ ఫేస్ న్యూస్ ను నమ్మవద్దని మరియు ఇతరులకు షేర్ కూడా చేయవద్దని ప్రజలకు విజ్ణప్తి చేసింది. ఏటీఎంలు ఎప్పటిలాగానే పనిచేస్తాయని పేర్కొంది. కాగా, పాక్ తో వైరం మరింత ముదురుతున్న నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. భారత్ సరిహద్దు ప్రాంతాలైన జమ్మూ, పంజాబ్, రాజస్తాన్లతో పాటు ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించింది. ఉత్తర, పశ్చిమ మరియు మధ్య ప్రాంతాల్లో 27 విమానాశ్రయాలను క్లోజ్ చేశారు. పంజాబ్, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో స్కూళ్లు, కాలేజీలు మూసివేశారు. దేశ రాజధాని ఢిల్లీ నుంచి రాకపోకలు సాగించే రవాణా వ్యవస్థను బంద్ చేశారు. అదే సమయంలో పోలీస్ సిబ్బందికి సెలవులు రద్దు చేశారు.