పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం దాయాది పాకిస్తాన్ పై ప్రతీకారంగా కఠిన చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే భారత్లో ఉన్న పాక్ పౌరులు తమ దేశం విడిచిపెట్టి వెళ్లాలని కేంద్రం అల్టిమేటం జారీ చేసింది. అందులో భాగంగానే పాక్ పౌరులకు జారీ చేసిన వీసాలను రద్దు చేసింది. భారత్ విధించిన గడువు ఆదివారం(ఏప్రిల్ 27)తోనే ముగిసింది. మెడికల్ వీసాలపై ఇండియా వచ్చిన వారికి రేపటి(ఏప్రిల్ 29) వరకు గడువు ఉంది.
ఈ నేపథ్యంలోనే పాక్ పౌరులకు భారత ప్రభుత్వం మరో బిగ్ షాక్ ఇచ్చింది. ఇండియాలో ఉన్న పాకిస్థానీయులు విధించిన గడువు లోగా దేశం వీడకపోతే జైలుకు పంపుతామంటూ కేంద్రం తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ఏప్రిల్ 4న అమలులోకి వచ్చిన ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారిన్ యాక్ట్ 2025 ప్రకారం.. వీసా గడువు ముగిసిన తర్వాత కూడా ఇండియాలోనే ఉన్న పాక్ పౌరులకు మూడేళ్ల జైలు శిక్ష లేదా రూ.3 లక్షల జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
కాగా, సుమారు 12 రకాల వీసాలు కలిగిన పాక్ పౌరులు దేశం వీడాలని భారత్ ప్రభుత్వం హెచ్చరికల జారీ చేయడంతో గత నాలుగు రోజులుగా పంజాబ్లోని అట్టారీ-వాఘా సరిహద్దు ద్వారా ప్రజలు భారీగా తిరుగుబాట పడుతున్నారు. ఇప్పటికే తొమ్మిది మంది దౌత్యవేత్తలు, అధికారులు సహా 509 మంది పాకిస్థానీలు స్వదేశానికి వెళ్లిపోయారు. మరోవైపు పాక్ నుంచి 745 మంది భారతీయులు స్వదేశానికి వచ్చారు.