భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఓ వైపు పాక్ ఊక దంపుడు ఉపన్యాసాలిస్తూ..తాటాకు చప్పుళ్లు చేస్తోంది. కానీ, మరోవైపు ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న క్రమంలో యుద్ధం వద్దు..చర్చలకు రెడీ అని భారత్ కు పాక్ రాయబారం పంపుతోంది. ఈ క్రమంలోనే తాజాగా పాక్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దార్ కీలక ప్రకటన చేశారు.
అణుబాంబు వేస్తాం…అంటూ ప్రగల్భాలు పలికిన పాక్..ఇప్పుడు కాళ్ల బేరానికి వచ్చినట్లు కనిపిస్తోంది.
భారత్ ఇక్కడితో ఆగిపోతే, మేము కూడా ఆగిపోయే అంశాన్ని పరిశీలిస్తామని ఇషాక్ దార్ చెప్పారు. భారత్ మళ్లీ దాడులకు పాల్పడితే, తాము కూడా తీవ్రంగా స్పందిస్తామని అన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోకు ఈ విషయం చెప్పామని తెలిపారు. ఇంతకుమించి ఉద్రిక్తతలు పెంచవద్దని ఇరు దేశాలకు రూబియో చెప్పిన సంగతి తెలిసిందే. కాగా, పాకిస్థాన్ సంయమనం పాటిస్తే, ఘర్షణలను పెంచబోమని భారత్ ఇదివరకే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
ఓ వైపు శాంతి మంత్రం పఠిస్తూనే, మరోవైపు పాక్ కవ్వింపు చర్యలను కొనసాగిస్తోంది. సరిహద్దు ప్రాంతాలపై దాడులకు పాల్పడుతూనే ఉంది. బారాముల్లా నుంచి గుజరాత్లోని భుజ్ వరకు దాదాపు 26 ప్రాంతాలపైకి డ్రోన్ బాంబులను ప్రయోగిస్తోంది. శ్రీ నగర్ విమానాశ్రయం, అవంతీపురాలోని వైమానిక స్థావరం లక్ష్యంగా చేసుకుని డ్రోన్లతో విఫలయత్నం చేసింది. భారత బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి.