జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటన తర్వాత ప్రతీకారంగా దాయాది పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టేలా భారత్ చర్యలు చేపట్టింది. ఇప్పటికే భారత్ లోని పాకిస్థానీ పౌరులు దేశం విడిచి వెళ్లిపోవాలని అల్టిమేటం జారీ చేసింది. మరోవైపు పాకిస్తాన్ కు చుక్క నీరు వెళ్లకుండా 1960 నాటి సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ విషయంపై చర్చించేందుకు శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాకిస్తాన్ కు నీటి ప్రవాహాన్ని పూర్తిగా నిలిపివేసే మార్గాలపై చర్చలు జరిగాయి. అయితే భారత్ తీసుకుంటున్న కఠిన చర్యలు, నిర్ణయాల పట్ల పాకిస్థాన్ ప్రభుత్వం ఎదురుదాడికి దిగుతోంది. నదీజలాలను ఆపితే అది యుద్ధంగా పరిగణిస్తామంటూ పాకిస్తాన్ హెచ్చరిస్తోంది.
ఇదే సమయంలో పాకిస్తాన్ లోని పౌరులు తమ సొంత ప్రభుత్వంపైనే సోషల్ మీడియాలో ఘాటుగా సెటైర్లు పేలుస్తున్నారు. తమ దేశ ఆర్థిక దుస్థితి, కనీస వసతుల కొరతను ఎత్తిచూపుతూ మీమ్స్ రూపంలో తమ అసహనాన్ని బయటపెడుతున్నారు. భారత్ నీళ్లు అపేస్తుందా.. అసలు మాకు నీటి సరఫరానే సరిగ్గా లేదంటూ అక్కడి సామాన్య పౌరులు స్పందిస్తున్నారు.
`మమ్మల్ని చంపేస్తారా? రోజూ మా ప్రభుత్వం మమ్మల్ని చంపుతూనే ఉందిగా`, `లాహోర్ తీసుకుంటారా? అరగంటలోనే అక్కడ ఏమీ లేదని మీరే తిరిగి ఇచ్చేస్తారు` అంటూ పాక్ ప్రభుత్వంపై అక్కడి పౌరులు పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. భారత్ సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంపై ఓ పాక్ నెటిజన్ రియాక్ట్ అవుతూ.. `భారత్ నీళ్లు వదులు` అనే క్యాప్షన్ తో స్నానం చేస్తుండగా సబ్బు కళ్లల్లో పడి నీళ్లు ఆగిపోయిన ఫోటోను షేర్ చేశాడు.
మరికొందరు నెటిజన్లు పేపర్ బోర్డ్తో ఫైటర్ జెట్లా తయారు చేసిన బైక్పై వెళ్తున్న వ్యక్తి ఫోటోను షేర్ చేస్తూ పాకిస్తాన్ వైమానిక దళాన్ని ట్రోల్ చేస్తున్నారు. పహల్గామ్లో ఉగ్రదాడి తర్వాత పాక్ లో పెరుగుతున్న ధరలు, గ్యాస్ కోతలను ఉద్దేశిస్తూ.. `యుద్ధం చేయాలనుకుంటే రాత్రి తొమ్మిది లోపే ముగించండి, ఆ తర్వాత గ్యాస్ సరఫరా ఉండదు` అని ఇంకొందరు తమ నిరాశను హాస్యం, మీమ్స్ రూపంలో వెళ్లగక్కుతున్నారు. మొత్తంగా సొంత పౌరులే పాకిస్తాన్ పరువు మొత్తాన్ని తీసేస్తున్నారు.