రాజధాని అమరావతి వ్యవహారంపై సీఎం చంద్రబాబు అదిరే ప్లాన్ వేశారు. దీనిపై గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని.. ఇకపై అధికారం మారినా.. అమరావతిని ఎవరూ కదల్చకుండా ప్రత్యేక దృష్టి సారిం చారు. వాస్తవానికి జగన్ హయాంలో ఏం జరిగిందో అందరకీ తెలిసిందే. మూడు రాజధానుల పేరుతో చేసి న యాగీ.. చివరకు ఆ పార్టీని అధికారంలో లేకుండా చేసింది. చివరకు 11 స్థానాలకు పరిమితం చేసి.. మొహం కూడా చూపించలేని పరిస్థితిని తీసుకువచ్చింది.
కట్ చేస్తే.. ఇప్పుడు అమరావతికి చట్టబద్ధత కల్పించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. అయితే.. ఇది అంత తేలిక విషయమా? కాదా? అనే చర్చ తెరమీదికి వచ్చింది. రాజధానిని చట్టబద్ధం చేస్తూ.. ఇప్పటి వరకు చేసిన చట్టాలు కూడా ఏమీ లేవు. ఒక్క కేంద్ర పాలిత ప్రాంతాలకు మాత్రమే రాజధానిని చట్ట బద్ధం చేస్తారు. వీటిపై ఎవరి పెత్తనం ఉండకుండా.. చూసుకునేందుకు రాజ్యాంగంలో ఈ ఏర్పాటు ఉంది.
కానీ, ఒక రాష్ట్రానికి రాజధానిని ఎంపిక చేసిన తర్వాత.. దీనిని చట్టం చేయరు. కానీ, కేంద్రం గుర్తించేలా మాత్రమే చేయగలరు. అయితే.. ఇప్పుడు అమరావతి వ్యవహారం.. వివాదంగా మారడంతోపాటు పెట్టుబడులు పెట్టేవారు కూడా.. రాజధానిపై అనుహ్యమైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ ప్రభుత్వం మారితే.. అమరావతే రాజధానిగా ఉంటుందా? అన్న ప్రశ్నలు తెరమీదికి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు నిర్ణయం కీలకం కానుంది.
ప్రక్రియ తేలికే!
నవ్యాంధ్ర రాజధాని అమరావతిని చట్టం రూపంలో తెచ్చేందుకు ప్రక్రియ తేలికేనని రాజధానిపై అధ్య యనం చేసిన కృష్ణారావు, మంత్రి నారాయణ కమిటీలు గతంలోనే చెప్పాయి. దీనికి అసెంబ్లీలో చర్చ పెట్టి.. ఆమోదం పొందుతారు. రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతిని గుర్తిస్తున్నట్టు సభ్యుల ఆమోదం పొందిన బిల్లును గవర్నర్కు పంపిస్తారు. అనంతరం.. దీనిని కేంద్రానికి పంపించి.. పార్లమెంటులోనూ చర్చ జరిగేలా చేస్తారు.
ఎలానూ..ఇతర రాష్ట్రాలు కూడా.. రాజధాని అమరావతికి మొగ్గు చూపుతున్నాయి కాబట్టి.. ముఖ్యంగా బీజేపీ అనుకూలమే కాబట్టి.. ఈ బిల్లుకు పార్లమెంటు కూడా ఆమోదం తెలిపి.. రాష్ట్రపతికి పంపిస్తారు. ఆమె ఆమోదంతో రాజ్యాంగంలోని షెడ్యూల్ 9 ద్వారా రాజధానిని గుర్తిస్తారు. ఇక, దీంతో రాజధానికి శాస్వత గుర్తింపు లభిస్తుంది.