సీఎంగా ఉన్నప్పుడే కాదు మాజీ సీఎం అయ్యాక కూడా జగన్ జనాల్లోకి రావడం లేదన్న వాదన ప్రజల్లో బలంగా వినిపిస్తోంది. మరోవైపు ఆయన సోదరి, ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మాత్రం దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ప్రజలతో మమేకమవుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవాన్ని తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. గత ఎన్నికలకు ముందు వరకు తన అన్న జగన్ను, వైసీపీని మాత్రమే టార్గెట్ చేసిన షర్మిల.. ఈ మధ్య కూటమి ప్రభుత్వంపై సైతం విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. షర్మిల మరోసారి జిల్లాల పర్యటనకు శ్రీకారం చూట్టారు. ఈ నెల 9 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆమె పర్యటించబోతున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల అయింది. షర్మిల పర్యటన తిరుపతి జిల్లా నుంచి ప్రారంభమై విశాఖ జిల్లాతో ముగుస్తుందని ఆదివారం ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్ఎన్ రాజా వెల్లడించారు. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ కడప, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు, ఎన్టిఆర్, కృష్ణా, ఏలూరు, పశ్చిమగోదావరి, బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో షర్మిల పర్యటన ఉండబోతుంది.
పర్యటనలో భాగంగా ఆయా జిల్లాల్లో సమస్యలు తెలుసుకోవడమే కాకుండా ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఉపయోగించుకోవాలని షర్మిల భావిస్తున్నారట. ఇక వైసీపీ అధ్యక్షుడు జగన్ విషయానికి వస్తే.. ఈయన ఎంతవరకు బెంగళూరు ప్యాలెస్కే పరిమితం అవుతున్నారు తప్ప ప్రజల్లోకి మాత్రం రావడం లేదు. నాలుగు నెలల క్రితం జిల్లాల పర్యటనకు వెళ్లనున్నట్లు జగన్ ప్రకటన చేశారు. వారంలో నాలుగు రోజుల పాటు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటిస్తానని అన్నారు. కానీ ఇంత వరకు అది కార్యరూపం దాల్చలేదు. అసలు జనంలోకి ఆయన వస్తారో రారో కూడా తెలియడం లేదు. ఈ నేపథ్యంలోనే షర్మిలను చూసైనా నేర్చుకోండి జగన్ సార్ అంటూ నెటిజన్లు హితవు పలుకుతున్నారు.