సోలో హీరోగా అక్కినేని నాగార్జున చివరి చిత్రం రిలీజై 15 నెలలు దాటింది. గత ఏడాది సంక్రాంతికి నా సామి రంగ చిత్రంతో పలకరించాడు నాగ్. ఆ సినిమా ఓ మోస్తరు ఫలితాన్నందుకుంది. నాగ్ ఓ పెద్ద హిట్ కొట్టి చాలా ఏళ్లే అయింది. పైగా ఆయనేమో 100వ సినిమా ముంగిట నిలిచాడు. అందుకే తర్వాతి సినిమా విషయంలో నాగ్ ఒక నిర్ణయానికి రావడానికి చాలా టైమే పడుతోంది. ముందేమో ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టును గాడ్ ఫాదర్ దర్శకుడు మోహన్ రాజాకు అప్పగిస్తారని వార్తలు వచ్చాయి. తర్వాతేమో నవీన్ అనే మరో తమిళ దర్శకుడి పేరు తెరపైకి వచ్చింది. అతను నాగ్ను కలిసిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో కనిపించాయి. కానీ ఈ కలయిక కూడా కార్యరూపం దాల్చలేదు. మరోవైపు నాగ్ ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్న కుబేర, కూలీ కూడా పూర్తయిపోయాయి కానీ.. సోలో హీరోగా మాత్రం సినిమా అనౌన్స్ చేయట్లేదేంటని అక్కినేని అభిమానులు నిరీక్షిస్తున్నారు.
ఐతే ఎట్టకేలకు నాగ్ వందో సినిమాకు రంగం సిద్ధమైనట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈసారి కూడా మరో తమిళ దర్శకుడి పేరే వినిపిస్తుండడం విశేషం. అశోక్ సెల్వన్ హీరోగా నితమ్ ఒరు వానం అనే మిడ్ రేంజ్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయిన ఆర్ఏ కార్తీక్తో నాగ్ తన వందో సినిమాకు జట్టు కట్టబోతున్నాడట. నితమ్ ఒరు వానం తమిళంలో బాగానే ఆడింది. ఈ చిత్రాన్ని తెలుగులో ఆకాశం పేరుతో రిలీజ్ చేశారు కానీ.. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేకపోయింది. అదొక క్లాస్ లవ్ స్టోరీ కాగా.. నాగ్ కోసం అతను యాక్షన్ కథను రెడీ చేసినట్లు సమాచారం. అక్కినేని కాంపౌండ్లో ఎంతో కసరత్తు, చర్చోప చర్చల తర్వాత ఈ ప్రాజెక్టుకు నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు. మరి సినిమానైనా నాగ్ ఖాయంగా పట్టాలెక్కిస్తాడా.. లేక మళ్లీ ఎక్కడైనా బ్రేక్ పడుతుందా అన్నది చూడాలి. వందో సినిమా కోసం నాగ్ బిగ్ బాస్ నుంచి కూడా బ్రేక్ తీసుకుంటున్నట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే.