మెగా బ్రదర్, జనసేన ఎమ్మెల్సీ నాగబాబు మంత్రి పదవి చేపట్టేందుకు సమయం ఆసన్నమైందా అంటే.. అవునన్న సమాధానమే వినిపిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గ విస్తరణకు సిద్ధమవుతున్నారు. ఈ విస్తరణలో జనసేనకు ఒక మంత్రి పదవి ఎప్పుడో ఖరారు అయింది. ఏపీ క్యాబినెట్ లో నాగబాబుకు చోటు కల్పిస్తామని చంద్రబాబు ఇప్పటికే ప్రకటన చేశారు.
అయితే బీజేపీ కూడా ఒక మంత్రి పదవి ఆశిస్తుండటంతో క్యాబినెట్ కూర్పు క్లిష్టంగా మారింది. ప్రస్తుతం ఏపీ క్యాబినెట్ లో 24 మంది మంత్రులు ఉన్నారు. ఈ జాబితాలో 20 మంది తెలుగుదేశం పార్టీకి చెందిన వారే కాగా.. జనసేన నుంచి పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్ మంత్రులుగా ఉన్నారు. అలాగే బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్ కు క్యాబినెట్ లో స్నానం దక్కింది. ఒక మంత్రి పదవి ఖాళీగా ఉంది. ఆ ఖాళీగా ఉన్న స్థానాన్ని ఇప్పుడు నాగబాబుతో భర్తీ చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. అలాగే బీజేపీ డిమాండ్ మేరకు ఆ పార్టీకి కూడా ఓ మంత్రి పదవి కేటాయించాలని నిర్ణయించారట.
ఇక ఇదే సమయంలో టీడీపీకి చెందిన ముగ్గురు మంత్రులు ఏపీ క్యాబినెట్ నుంచి అవుట్ కాబోతున్నారని బలంగా ప్రచారం జరుగుతుంది. కోస్తా, ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన సదరు ముగ్గురు మంత్రులు ఏడాది కాలంలో సరైన పనితీరును కనబరచని నేపథ్యంలో వారిపై వేటు వెయ్యాలని అధిష్టానం నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆయా మంత్రులకు సమాచారం కూడా అందించినట్టు తెలుస్తోంది. వారి స్థానంలో కొత్తవారిని ఎంపిక చేయవచ్చని అంటున్నారు. కాగా, ప్రస్తుతం ఏపీ క్యాబినెట్లో సీనియర్ల కన్నా కొత్తగా పదవి చేపట్టిన వారే అధికంగా ఉన్నారు. అందుకే ఈసారి సీనియర్లకు మంత్రివర్గంలో చొటు దక్కొచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.