పుష్ప-2 సినిమాలోని కొన్ని సన్నివేశాలకు దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ నచ్చక.. దర్శకుడు సుకుమార్ వేరే సంగీత దర్శకులను ఆశ్రయించడం అప్పట్లో ఎంత చర్చనీయాంశం అయిందో తెలిసిందే. ఇది సుకుమార్, దేవి మధ్య గ్యాప్కు కారణమైందనే ప్రచారం కూడా జరిగింది. కానీ సుకుమార్ మాత్రం సినిమా మంచి కోసమే ఇదంతా చేశారని ఆయన మద్దతుదారులు అన్నారు. బ్యాగ్రౌండ్ స్కోర్ బాధ్యతను తమన్, అజనీష్ లోక్నాథ్, సామ్ సీఎస్.. ఈ ముగ్గురికీ అప్పగించారు.
కానీ చివరికి సినిమాలో చాలా వరకు దేవి స్కోరే వాడారు. కొన్ని సీన్లకు సామ్ సీఎస్ వర్క్ తీసుకున్నారు. పుష్ప-2కు పని చేయడం గురించి చాలా ఎగ్జైట్ అయిన తమన్ నుంచి చివరికి ఏ స్కోర్ తీసుకోకపోవడం అతడికి అవమానమే అన్న కామెంట్లు సోషల్ మీడియాలో కనిపించాయి. ఐతే తమన్ మాత్రం పుష్ప-2 టీం ఇచ్చిన షాక్ విషయంలో చాలా లైట్ అని అర్థమవుతోంది.
యాంకర్ సుమతో ఓ చిట్ చాట్ ఇంటర్వ్యూ సందర్భంగా పుష్ప-2కు పని చేయడం, తన వర్క్ను టీం తీసుకోకపోవడం గురించి తమన్ మాట్లాడాడు. ”ఆ సినిమాకు నన్ను ఆర్ఆర్ చేయమనగానే చాలా సంతోషించాను. దాని కోసం నేను 8, 9 రోజులు పని చేశాను. మూడు రీల్స్కు స్కోర్ చేసి పంపించాను. నా వర్క్ నచ్చిందని టీం సభ్యులు చెప్పారు. కానీ సినిమాలో దేవిది, సామ్ సీఎస్ది మాత్రమే స్కోర్ వాడుకోవాలని అనుకున్నారు. తక్కువ టైంలో నిర్ణయం తీసుకోవాల్సిన స్థితిలో అలా చేశారు. అది నేను అర్థం చేసుకోగలను. ఏదైనా సరే దర్శకుడిదే తుది నిర్ణయం. వాళ్ల నిర్ణయాన్ని గౌరవిస్తాను. నేను అందులో ఫీలయ్యేదేమీ లేదు” అని తమన్ చెప్పాడు.
ఇక తన కెరీర్లో అత్యంత వేగంగా చేసిన పాట గురించి తమన్ ఈ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. బిజినెస్ మ్యాన్ సినిమాలోని సారొస్తారా పాటను కేవలం 12 నిమిషాల్లో చేసినట్లు చెప్పాడు. నిజానికి ఈ సినిమాలో ముందు ఆ పాట లేదని.. కానీ అన్నీ నెగెటివ్, యాటిట్యూడ్ సాంగ్సే ఉన్నాయని తాను అంటే.. నేను రూంకు వస్తున్నా పాట చేయండి అంటూ తనకు, భాస్కరభట్లకు చెప్పారని.. ఆయన వచ్చేలోపే పాట చేసేశామని.. అది ఆల్బంలో పెద్ద హిట్ అయిందని తమన్ తెలిపాడు.