ఏపీలో మున్సిపల్ ఎన్నికలు హీటు పుట్టిస్తున్నాయి. రాష్ట్రంలో పలు మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో ఖాళీగా ఉన్న చైర్మన్, ఛైర్ పర్సన్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక నేడు జరుగుతోంది. అయితే కొద్ది సేపటి క్రితమే హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. మున్సిపల్ ఛైర్మన్ గా టీడీపీ అభ్యర్థి రమేశ్ కుమార్ ఎన్నిక అయ్యారు. హిందూపురం మున్సిపాలిటీని స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మరోవైపు వైసీపీ కూడా హిందూపురం మున్సిపాలిటీని దక్కించుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేసింది. కానీ బాలయ్య మాత్రం వైసీపీకి ఆ అవకాశం ఇవ్వలేదు.
రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవికి వైసీపీ నేత ఇంద్రజ రాజీనామా చేసి పసుపు కండువా కప్పుకున్నారు. ఆమె వెంటే మరో ఇరవై మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరిపోయారు. అయితే స్థానిక రాజకీయాల కారణంగా నలుగురు కౌన్సిలర్లు మళ్లీ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. దీంతో ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బాలయ్య సినిమా షూటింగ్స్ నుంచి బ్రేక్ తీసుకుని మరీ హిందూపురంలో మకాం వేశారు. దగ్గరుండి క్యాంప్ రాజకీయాలను పర్యవేక్షించారు.
వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన కౌన్సిలర్లు మళ్లీ సొంత గూటికి చేరుకోనివ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. క్షేత్ర స్థాయిలో రాజకీయం చేసి హిందూపురం మున్సిపాలిటీని వైసీపీకి దక్కకుండా చేయంలో బాలయ్య సక్సెస్ అయ్యారు. సోమవారం నిర్వహించిన ఓటింగ్ లో టీడీపీకి అనుకూలంగా 23 ఓట్లు వస్తే.. వైసీపీ అభ్యర్థి వెంకటలక్ష్మికి 14 ఓట్లు మాత్రమే పడ్డాయి. దాంతో టీడీపీ అభ్యర్థి రమేష్ను అభినందించిన బాలయ్య.. ఆయన్ను దగ్గరుండి సీట్లో కూర్చోబెట్టారు. మొత్తానికి హిందూపరంలో వైసీపీ అబ్బా అనేలా బాలయ్య దెబ్బ కొట్టారు.
ఇకపోతే నెల్లూరు కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్ ఎన్నికలో టీడీపీ అభ్యర్థి తహసీన్ ఎన్నిక అయ్యారు. టీడీపీ నుంచి 48వ డివిజన్ కార్పొరేటర్ తహసీన్కు 41 ఓట్లు పడగా.. వైసీపీ అభ్యర్థి కరిముల్లాకు 21 ఓట్లు వచ్చాయి. అలాగే ఏలూరులోనూ పసుపు జెండానే రెపరెపలాడింది. ఏలూరు డిప్యూటీ మేయర్ పదవులు టీడీపీ కైవశం అయ్యాయి. ఉమామహేశ్వరరావు, దుర్గాభవానీ డిప్యూటీ మేయర్లుగా ఎన్నికయ్యారని అధికారులు ప్రకటించారు. తిరుపతి డిప్యూటీ మేయర్, నందిగామ మున్సిపల్ చైర్మన్, పిడుగురాళ్ల వైస్ చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది.