గత కొద్ది రోజుల నుంచి ఏపీ పాలిటిక్స్ డిప్యూటీ సీఎం చుట్టూనే తిరుగుతున్నాయి. యువగళం పేరుతో రాష్ట్రమంతా పాదయాత్ర నిర్వహించి కూటమి గెలుపులో కీలకంగా వ్యవహరించిన మంత్రి నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలంటూ టీడీపీ క్యాడర్ గట్టిగా డిమాండ్ చేస్తోంది. టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడు, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి స్వయంగా సీఎం చంద్రబాబు సమక్షంలోనే లోకేష్కి డిప్యూటీ సీఎంగా పదోన్నతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దాంతో మిగతా నేతలు సైతం ఒక్కొక్కరిగా ఇదే వాదనను వినిపిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా విస్తృత ప్రచారం చేస్తున్నారు.
ప్రస్తుతం ఉపముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆ పదవికి తగినట్లుగానే నిరంతరం ప్రజల్లో ఉంటూ.. ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరిస్తూ తన పొలిటికల్ గ్రాఫ్ ను భారీగా పెంచుకుంటున్నారు. రాష్ట్రంలో నెం. 2గా కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు పవన్ తో సమానంగా లోకేష్ కు కూడా డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలని టీడీపీ శ్రేణులు పట్టబడుతుండటంతో.. జనసేన కార్యకర్తలకు అది ఏమాత్రం రుచించడం లేదు. ఈ క్రమంలోనే జననేత నేతలు టీడీపీ శ్రేణులపై కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు.
నిజమే లోకేష్ను డిప్యూటీ సీఎంగా చేయండి. అదే సమయంలో పవన్ కళ్యాణ్ను సీఎంగా చేయాలి. చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలి అంటూ జననేత నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ వివాదం రోజురోజుకు ముదురుతున్న తరుణంలో పార్టీ నాయకత్వం డిప్యూటీ సీఎం పదవిపై ఎవరూ ఎటువంటి వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించింది. మరోవైపు మంత్రి నారా లోకేష్ సైతం ఫస్ట్ టైమ్ డిప్యూటీ సీఎం హోదాపై రియాక్ట్ అయ్యారు.
మంగళవారం స్విట్జర్లాండ్లోని దావోస్ పట్టణంలో ఓ జర్నలిస్ట్ ఈ విషయంపై ప్రశ్నించగా.. `ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో నమ్మకంతో నాకు చాలా కీలక బాధ్యతలు అప్పగించారు. విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని ఆయన ఆశిస్తున్నారు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు, ఆశయాన్ని సాధించేందుకు నేను నిరంతరం శ్రమిస్తున్నా. ఇతర ఆలోచనలకు తావులేదు. ఎన్నికల్లో ప్రజలు మమ్మల్ని నమ్మి తిరుగులేని విజయాన్ని అందించారు. రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూటమి ప్రభుత్వం సాగుతుంది` అంటూ లోకేష్ చెప్పుకొచ్చారు.