హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ప్రస్తుత రోజుల్లో ఫేస్ బుక్ పరిచయాలు ఎందరి అమాయకుల జీవితాలను నాశనం చేస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా అమ్మాయిలు కేటుగాళ్ల వలలో చిక్కి గుడ్డిగా మోసపోతున్నారు. తాజాగా హైదరాబాద్ కు చెందిన ఓ యువతి కూడా ఫేస్బుక్ మాయలోడి ట్రాప్ లో పడి కష్టాలను కొని తెచ్చుకుంది. నయ వంచనకు గురైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
హైదరాబాద్ బంజారాహిల్స్లో నివాసం ఉంటున్న 24 ఏళ్ల యువతికి 2023 ఫిబ్రవరిలో ఫేస్బుక్ ద్వారా మహేంద్రవర్దన్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. యువతితో చాటింగ్ మొదలుపెట్టిన మహేంద్రవర్దన్.. తనను తాను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పని చేస్తున్నట్లు చెప్పుకున్నాడు. సదరు యువతి కూడా రిప్లై ఇస్తూ మాటలు కలిపింది. ఇద్దరూ ఫ్రెండ్స్ అయ్యారు. చాటింగ్ కాస్తా కాల్స్ వరకు వచ్చింది. కొన్నాళ్లు మాట్లాడుకున్నాక ఒక రోజు కాఫీ షాప్కు మహేంద్రవర్దన్ పిలవడంతో.. ఆమె వెళ్లింది.
సరిగ్గా అదే ఏడాది ఆగస్టు 15న సదరు యువతిని లంచ్కు ఆహ్వానించాడు. ఫ్రెండ్లీగానే పిలవడంతో ఆమె మహేంద్రవర్దన్ ఇంటికి భోజనానికి వెళ్లింది. అక్కడ ఆమెను మాయ మాటల్లో పెట్టి మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చాడు. అది తాగి మగతలోకి జారుకున్న ఆమెపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా.. ఆ దారుణాన్నంతా ఫోటోలు, వీడియోలు తీశాడు. నెక్స్ట్ డే మార్నింగ్ వాటిని సదరు యువతికి చూపించి బ్లాక్ బెయిల్ ప్రారంభించారు.
తనకు రూ. 20 లక్షలు ఇవ్వాలని.. లేదంటే ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించారు. దాంతో తీవ్ర వేదనకు గురైన బాధితురాలు.. అతను అడిగిన మొత్తం ఇచ్చింది. అక్కడితో అంతా ముగిసిపోయిందని భావించింది. కానీ కొన్నాళ్లుగా మళ్లీ తనకు రూ.కోటి ఇవ్వాలంటూ బాధితురాలిని మహేంద్రవర్దన్ డిమాండ్ చేయడం ప్రారంభించాడు. అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలో అర్థంగాక.. అతని టార్చర్ భరించలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఇక కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.