జమ్మూ కశ్మీర్ లోని పహల్గాం లో జరిగిన ఉగ్రదాడి ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ దాడిలో హిందువులా, ముస్లింలా అని అడిగి ప్రత్యేకించి హిందువులను గుర్తించి మరీ కాల్పులు జరిపారని బాధితులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ముష్కరుల దాడిలో కావలికి చెందిన మధుసూదన్ చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మధుసూదన్ భార్య సంచలన విషయాన్ని వెల్లడించారు. కాల్పుల శబ్దం విన్న తర్వాత తాను, తన భర్త కంగారు పడ్డామని, దీంతో, అక్కడి నుంచి పరుగులు తీసేందుకు ప్రయత్నించామని వెల్లడించారు.
అయితే, శాలువాలు అమ్మే కొందరు స్థానికులు తమను అడ్డుకున్నారని, అవి కశ్మీరీ వార్షికోత్సవ వేడుకలకు సంబంధించిన శబ్దాలని, భయపడాల్సిన పని లేదని తమను తప్పుదోవ పట్టించారని చెప్పారు. కానీ, అక్కడే ఉన్న ఒక హోటల్ యజమాని అవి తుపాకుల కాల్పుల శబ్దమని గ్రహించారని, ప్రమాదాన్ని పసిగట్టి, తమ పిల్లలను, ఇతరులను వెంటనే పారిపోవాలని హెచ్చరించారని గుర్తు చేసుకున్నారు.
ఆయన హెచ్చరికతో పిల్లలు, కొందరు వ్యక్తులు ముందుగానే పారిపోయారని, శాలువాలు అమ్మే వారు మిస్ గైడ్ చేయడంతో తాము పారిపోలేకపోయామని, ఈలోపే ఉగ్రవాదులు తమ దగ్గరకు వచ్చారని చెప్పారు. నేలపై పడుకుందామని, తల ఎత్త వద్దని తన భర్త చెప్పారని కన్నీటి పర్యంతమయ్యారు. ‘హిందూ? ముస్లిం?’ అని రెండు సార్లు అడిగారని, తాము ఏమీ స్పందించలేదని, ఆ వెంటనే గన్ షాట్ సౌండ్ వినిపించిందని చెప్పారు.
రెండు నిమిషాల తర్వాత తాను లేచి చూసేసరికి తన భర్త మొఖం రక్తంతో నిండిపోయిందని, తన దుస్తులు రక్తంతో తడిసిపోయాయని అన్నారు. ఆ గన్ షాట్ తన భర్త తలకే తగిలిందని అప్పుడు తనకు అర్థమైందని ఆ భయానక ఘటనను గుర్తు చేసుకొని కన్నీరుమున్నీరయ్యారు. మోదీ పాలనలో కశ్మీర్ సురక్షితంగా ఉంటుందని భావించామని, కానీ, అక్కడ ఇలా జరుగుతుందని ఊహించలేదని చెప్పారు.
తన భర్తను కాల్చిన తర్వాత భయంతో తాను పరిగెత్తానని, రక్షించేవారు కనిపిస్తారేమోనని చూశానని, కానీ ఎవరూ కనిపించలేదని తెలిపారు. ఆ తర్వాత కొందరు తనను ఆర్మీ క్యాంప్ దగ్గరకు తీసుకెళ్లారని చెప్పారు. ఉగ్రవాదులు అత్యంత క్రూరంగా ప్రవర్తించారని, చంపొద్దని వేడుకున్నా వదల్లేదని అన్నారు. తన భర్తకు ఒకే ఒక్క బుల్లెట్ తగిలిందని, 46 బుల్లెట్లు తగిలాయనే వార్తలు అవాస్తవమని ఆమె స్పష్టం చేశారు.