5 రోజుల పర్యటనలో 50మందికిపైగా ప్రముఖులతో సమావేశాలు
అమరావతి: రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల కల్పన, భారీ పెట్టుబడుల సాధనే లక్ష్యంగా పెట్టుబడుల టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్, రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఈనెల 20నుంచి 24వరకు దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు హాజరుకానున్నారు.
అయిదురోజులపాటు జరిగే ఈ సదస్సులో వివిధ దేశాలకు చెందిన 50మందికి పైగా అంబాసిడర్లు, పారిశ్రామికవేత్తలు, పారిశ్రామికరంగ పెద్దలతో మంత్రి లోకేష్ భేటీ కానున్నారు.
ప్రత్యేకించి ఎపి పెవిలియన్ లో ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికగన్న 30మంది పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చలు జరుపుతారు.
వరల్డ్ ఎకనమిక్ ఫోరం (World Economic Forum) వేదికగా విద్యారంగంలో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులపై విద్యారంగ గవర్నర్ల సమావేశం (Educarion Governors meeting) లో పాల్గొంటారు.
ఇంటిలిజెంట్ పరిశ్రమల కోసం మెరుగైన పర్యావరణ వ్యవస్థ నిర్మాణం (Building the Ecosystem for Intelligent Industries), అధునాతన యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ప్రభావం (AI energy impact), జెండర్ పారిటీ స్ప్రింట్ ఛాంపియన్స్ (Gender parity Sprint Champions) అంశాలపై ప్రముఖులతో నిర్వహించే సమావేశాలకు హాజరవుతారు.
నెక్ట్స్ జెన్ ఎఐ, డాటా ఫ్యాక్టరీ, ఎఐ విశ్వవిద్యాలయం ఏర్పాటు అంశాలపై ఎన్ విడియా ప్రతినిధులు, ఎఐ ఫర్ గుడ్ గవర్నెన్స్ పై గూగుల్ సంస్థ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొంటారు.
గ్లోబల్ ఎకనామీ స్థితిగతులు – లేబర్ మార్కెట్ పై ఎఐ ట్రాన్స్ ఫర్మేషన్ ప్రభావం (The Transmission impact of AI on Global Economies & Labour Markets) అనే అంశంపై వైట్ షీల్డ్ తో, భవిష్యత్తుపై వాతావరణ ఉద్యమ ప్రభావంపై (What does the future hold for climate movement) అంశంపై స్వనీతి ఇనిషియేటివ్ ప్రతినిధులతో, వార్షిక లీడర్ ఫోరమ్ పునరుద్దరణ (Renew Annual Leader Forum)పై నిర్వహించే సమావేశాలకు మంత్రి లోకేష్ హాజరు కానున్నారు.
5 రోజుల సదస్సులో 30మంది దిగ్గజ పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి సమావేశమై ఎపిలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానిస్తారు.
రాష్ట్రంలో పెట్టుబడులకు గల అనుకూలతలు, మెరుగైన పర్యావరణ వ్యవస్థ, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సహకాల గురించి వారికి వివరిస్తారు.
సిఎన్ బిసి – టివి 18, బిజినెస్ టుడే, ఎకనమిక్ టైమ్స్, బ్లూమ్ బర్గ్, మనీ కంట్రోల్ వంటి ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థల ప్రతినిధులతో ఇంటరాక్టివ్ సెషన్స్ కు హాజరవుతారు.
భారత్ – డెన్మార్క్ మధ్య గ్రీన్ స్ట్రాటజిక్ పార్టనర్ షిప్ ను బలోపేతం చేయడంపై నిర్వహించే సదస్సుతోపాటు కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ) నిర్వహించే కార్యక్రమానికి మంత్రి లోకేష్ అతిధిగా హాజరవుతారు.
రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారిగా వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్తున్న మంత్రి లోకేష్ వైపు పారిశ్రామికవర్గాలు ఆసక్తితో ఎదురుచూస్తున్నాయి.