నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు రక్షణ కల్పించాలంటూ ఆమె సామాజిక వర్గానికి చెందిన సంఘం వారు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు లేఖ రాయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గత కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా రష్మిక ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆమె నటించే ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. ఇటీవల `ఛావా` మూవీతో రష్మిక మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
ఛావా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో రష్మిక ఇటీవల మాట్లాడుతూ.. `హైదరాబాద్ నుంచి వచ్చిన నాపై ఇక్కడి వారు చూపుతున్న ప్రేమాభిమానాలు చూసి ఎంతో ఆనందంగా ఉంది` అంటూ వ్యాఖ్యానించింది. అయితే రష్మిక వ్యాఖ్యలు కర్ణాటకలో తీవ్ర దుమారం రేపాయి. కన్నడ అమ్మాయి అయిన రష్మిక తాను హైదరాబాద్ నుంచి వచ్చానని చెప్పుకోవడం కర్ణాటక సినీప్రియులకు ఏమాత్రం నచ్చలేదు. ఈ క్రమంలోనే రష్మిక తీరును తప్పుబడుతూ అక్కడివారు పెద్ద ఎత్తున ఆమెను విమర్శించారు.
కర్ణాటకలోని మాండ్యాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి గనిగ సైతం రష్మిక పై మండిపడ్డారు. కెరీర్ ఇచ్చిన ఇండస్ట్రీని గౌరవించడం లేదని.. బెంగళూరు వేదిక జరుగుతోన్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా రష్మిక పాల్గొనలేదని ఆయన ఆరోపించారు ఆమెకు సరైన గుణపాఠం చెప్పాలంటూ పిలుపునిచ్చారు. ఈ పరిణామాల నడుమ రష్మిక భద్రత కోసం ఆమె కులానికి(కొడవ) చెందిన సంఘం వారు రంగంలోకి దిగారు. కొడవ నేషనల్ కౌన్సిల్(సిఎస్సి) వరుస విజయవంతమైన సినిమాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్నాకు రక్షణ కల్పించాలని కోరుతూ కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, రాష్ట్ర హోమ్ మంత్రి జి. పరమేశ్వర్లకు లేఖ రాసింది.
తమ తీగ కు చెందిన రష్మిక తన కృషి, ప్రతిభతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నత స్థాయికి చేరుకుంది. అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్ వంటి గొప్ప నటులతో స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే ఇటీవల ఆమె చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెను దుమారం రేగడంతో కర్ణాటకు చెందిన ఒక ఎమ్మెల్యేతో పాటు కన్నడ అనుకూల వర్గం ఆమెపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. మాట్లాడే స్వేచ్ఛ ఉంది కాబట్టి తన అభిప్రాయాన్ని రష్మిక పంచుకున్నారు. కానీ ఎమ్మెల్యే చేసిన ప్రకటనతో ఆమెలో భయం పెరిగింది. వెనకబడిన సమాజికవర్గానికి చెందిన మహిళ అయినందునే ఆమెను టార్గెట్ చేస్తున్నారు. దయచేసి రష్మికకు రక్షణ కల్పించండి అని కోరుతూ కొడవ బోర్టు చైర్మన్ ఎన్.యు.నాచప్ప లేఖ రాశారు.