ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసలు క్రిస్టియనే కాదంటున్నారు ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్. అనంతపురం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న కేఏ పాల్.. మరోసారి తన నోటికి పని చేశారు. జగన్ నుంచి దేశ ప్రధాని నరేంద్ర మోదీ వరకు వరుస పెట్టి ఏకిపారేశారు. ముఖ్యంగా జగన్ పై పాల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ అసలు క్రిస్టియన్ కాదని.. ఆయన శ్రీవేంకటేశ్వరస్వామి భక్తుడని, చిన్నజీయర్ స్వామికి శిష్యుడని పాల్ వ్యాఖ్యానించారు. చిన్నజీయర్ స్వామి ఆశీస్సులు తీసుకోవడం వల్లే గత ఎన్నికల్లో జగన్ ఘోరంగా ఓడిపోయారని ఎద్దేవా చేశారు.
అదేవిధంగా గతంలో మోదీపై దుమ్మెత్తి పోసిన పవన్ కళ్యాణ్, చంద్రబాబు.. ఇప్పుడేమో అదే మోదీని విశ్వగురు, మిసైల్ అంటూ ఆకాశానికి ఎత్తేయడం విడ్డూరంగా ఉందని పాల్ విమర్శించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, జగన్, రేవంత్ రెడ్డి, కేసీఆర్, కేటీఆర్ వంటి నేతలంతా మోదీకి తొత్తులంటూ పాల్ మండిపడ్డారు. వారెవరికీ నేరుగా మోదీని ఎదుర్కొనే ధైర్యం లేదని.. ఆ దమ్ము తనకు మాత్రమే ఉందన్నారు. హిందూ, ముస్లిం, క్రైస్తవుల మధ్య చిచ్చుపెట్టే మిసైల్ మోదీ అని విమర్శలు గుప్పించారు.
1989లో తాను అమెరికా వెళ్లినప్పుడు ఇండియా, చైనా జీడీపీ సమానంగా ఉండేదని, కానీ నేడు చైనా ఏడు రెట్లు అభివృద్ధి చెంది వంద దేశాలకు అప్పులిస్తోంది. ఇండియా మాత్రం వంద దేశాల ముందు అప్పుల కోసం చేయి చాచే దుస్థితికి దిగిజారిపోయిందని పాల్ మండిపడ్డారు. అందుకే పాల్ అన్న పాలన రావాలి… పాలన మారాలంటూ పిలుపునిచ్చారు. ఏపీ, తెలంగాణల్లో చెరో వంద సీట్లతో తనను గెలిపించి సీఎం చేయండి లేదా 42 ఎంపీ సీట్లిస్తే ప్రధానమంత్రినై దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానంటూ పాల్ ఈ సందర్భంగా వెల్లడించారు.