స్టార్ హీరోయిన్ సమంత వ్యక్తిగత జీవితంలో తీవ్ర ఒడుదొడుకులే ఎదుర్కొంది గత కొన్నేళ్లలో. అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లాడాక.. నాలుగేళ్లు తిరక్కుండానేే విభేదాలు తలెత్తి విడిపోవడం.. అదే సమయంలో అనారోగ్యం పాలవడం.. మరోవైపు విడాకుల తాలూకు ట్రామాను అనుభవించడం.. ఇలా సమంత ఎన్నో ఇబ్బందులు పడింది. అవతల నాగచైతన్య కొత్త తోడును వెతుక్కుని రెండో పెళ్లి చేసుకోగా.. సమంత సింగిల్గానే ఉండడం అభిమానులకు నచ్చలేదు. ఐతే సమంత ఒంటరి జీవితం పాత కథ అని.. ఆమె జీవితంలోకి కూడా ఓ వ్యక్తి వచ్చేశారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. సమంత కీలక పాత్ర పోషించిన ‘ఫ్యామిలీ మ్యాన్-2’ రూపకర్తల్లో ఒకరైన రాజ్ నిడిమోరుతో సమంత రిలేషన్షిప్లో ఉన్నట్లుగా కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఇటీవల సమంత పక్కన తరచుగా కనిపిస్తున్నాడు రాజ్. తాజాగా ఆమెతో కలిసి తిరుమలకు కూడా వచ్చి శ్రీవారిని దర్శించుకున్నాడు. తమ బంధం గురించి ఈ ఇద్దరూ ఓపెన్ అయిపోయినట్లే అనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం వీరి మధ్య ఉన్నది కేవలం వర్క్ రిలేషన్ కాదన్నది స్పష్టం. కొంత కాలం డేటింగ్ చేశాక పెళ్లి చేసుకోవడానికి ఇద్దరూ రెడీ అయిపోయారని తెలుస్తోంది. రాజ్కు ఇంతకుముందే శ్యామలి అనే అసోసియేట్ డైరెక్టర్తో పెళ్లయింది.
ఐతే తర్వాత వీళ్లిద్దరూ విడిపోయినట్లు తెలుస్తోంది. సమంతతో అతను కొత్త జీవితం మొదలుపెట్టడానికి రెడీ అయిపోయాడట. పెళ్లికి ఓకే అనుకున్నాకే ఈ జంట తిరుమలకు తమ కుటుంబాలతో కలిసి వచ్చినట్లు తెలుస్తోంది. అతి త్వరలోనే పెళ్లి కబురు వినిపిస్తే ఆశ్చర్యమేమీ లేదు. ప్రస్తుతం రాజ్-డీకే నెట్ ఫ్లిక్స్ కోసం రూపొందిస్తున్న ‘రక్తబ్రహ్మాండ్’ వెబ్ సిరీస్లో సమంత నటిస్తోంది. ఆమె నిర్మాణంలో రూపొందిన ‘శుభం’ అనే చిన్న చిత్రం వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.